బంగ్లాదేశ్తో చివరి సూపర్-4 మ్యాచ్కు టీమిండియా రెడీ అవుతోంది. ఇప్పటికే ఆసియా కప్ ఫైనలిస్టులు తేలిపోవడంతో ఈ మ్యాచ్కు ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్పై టీమిండియా చాలా ప్రయోగాలు చేస్తుందని సమాచారం. దీనిపై తాజాగా మాట్లాడిన మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా.. విరాట్ కోహ్లీని పక్కన పెట్టేయాలని సూచించాడు.
అలాగే టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్కు జట్టులో అవకాశం ఇవ్వాలని కోరాడు. సూర్య ఇంకా వన్డేలు ఆడటం అలవాటు చేసుకోలేదని, అతన్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడిస్తారని ప్రశ్నించాడు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఆకాష్ చోప్రా పలు సూచనలు చేశాడు.

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని పక్కన పెట్టాలని, అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ను ఆడించాలని చోప్రా సూచించాడు. అలాగే సూర్యకు కూడా అవకాశం ఇవ్వాలన్నాడు. 'సూర్యకుమార్ యాదవ్ను ఆడిస్తారా? నన్నడిగితే అతన్ని ఆడించాలనే చెప్తా. ఇప్పుడు కాకపోతే మళ్లీ అతన్ని ఆడించే అవకాశం ఎక్కడుంది? వన్డే ఫార్మాట్ నాడి పట్టుకోవడంలో సూర్య ఇంకా సక్సెస్ కాలేదనేది మనందరికీ తెలిసిందే' అని చోప్రా అన్నాడు.
వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో కూడా సూర్యకు చోటు దక్కిన విషయాన్ని ఈ సందర్భంగా చోప్రా గుర్తుచేశాడు. ఇప్పుడు కనుక సూర్యను ఆడించకపోతే.. ఆ తర్వాత చాలా ఇబ్బంది తలెత్తుతుందని హెచ్చరించాడు. 'వన్డే ఫార్మాట్లో సూర్య ఆడలేకపోతే.. అతన్ని ఇప్పుడు ఆడించకపోతే ఆస్ట్రేలియాతో ఆడించాలి. అప్పుడు కూడా ఆడించకపోతే.. వరల్డ్ కప్ కోసం జట్టు పూర్తిగా రెడీ అయినట్లు కాదు' అని చోప్రా చెప్పుకొచ్చాడు.
'అలా కనుక చేయకపోతే వరల్డ్ కప్ జట్టులో 14 మంది మాత్రమే వన్డేలకు రెడీగా ఉంటారు. లేదంటే ట్యాలెంట్ ఉందని, రాణిస్తాడని మాత్రమే నమ్మి చివరి ప్లేయర్ను టీంలోకి తీసుకున్నామని చెప్తారా?' అని చోప్రా నిలదీశాడు. కాబట్టి సూర్యను ఎలాగైనా ఆడించాలని అన్నాడు. అదే సమయంలో కోహ్లీ స్థానంలో శ్రేయాస్ వస్తాడని తను అనుకుంటున్నట్లు చెప్పాడు.