బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా పరమ చెత్త ప్రదర్శన చేసింది. దీంతో బంగ్లా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. బ్యాటర్లలో గిల్, అక్షర్ మినహా ఎవరూ రాణించలేదు. ఈ క్రమంలో లక్ష్యానికి ఆరు పరుగుల దూరంలో టీమిండియా చతికిలపడింది. ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ బాగానే ఉన్నా కూడా ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. అరంగేట్ర ఆటగాడు తిలక్ వర్మ తనకు వచ్చిన తొలి క్యాచ్ నేలపాలు చేశాడు.
ఆ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ నిలబెట్టిన కెప్టెన్ షకీబల్ హసన్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ కేఎల్ రాహుల్ జారవిడిచాడు. ఇలా ఫీల్డింగ్లో టీమిండియా తేలిపోవడంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. భారత్ ఓటమికి ఇలా క్యాచులు వదిలేయడమే కారణమని చోప్రా అభిప్రాయపడ్డాడు. 'భారత జట్టు ఎప్పట్లాగే క్యాచులు నేలపాలు చేసింది. గతేడాది కాలంలో మన ఫీల్డింగ్ ఎంత చెత్తగా ఉందో ఒకసారి పరిశీలించండి' అన్నాడు.

'క్యాచులు పట్టే విషయంలో మన టీం కింది నుంచి రెండో స్థానంలో ఉంటుంది. అంటే మనం క్యాచులు పట్టడం లేదన్నమాట' అని చెప్పిన చోప్రా.. నేపాల్తో మ్యాచులో కూడా టీమిండియా ఇలాగే క్యాచులు వదిలేసిన విషయాన్ని గుర్తుచేశాడు. అయితే అది నేపాల్పై కావడంతో పెద్ద సమస్య కాలేదని, కానీ ఇప్పుడు బంగ్లాపై నేలపాలు చేసిన క్యాచులకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
'ఈ మ్యాచులో మన టీం చాలా క్యాచులు నేలపాలు చేసింది. నేపాల్పై కూడా ఇదే జరిగింది. క్రికెట్లో క్యాచులే మ్యాచులు గెలిపిస్తాయి. వాటిని వదిలేస్తే ఓడిపోక తప్పదు' అన్నాడు. నేపాల్తో మ్యాచ్లో టీమిండియా మూడు కీలక క్యాచులు వదిలేసిన సంగతి తెలిసిందే. ఇక బంగ్లాపై తిలక్ వర్మ, సూర్యకుమా్ ఇద్దరూ.. మెహదీ హసన్ మిరాజ్ ఇచ్చిన క్యాచులు వదిలేశారు.
ఇక ఆ టీం కెప్టెన్ షకీబల్ హసన్ క్యాచ్ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. 'తిలక్ బౌలింగ్లో -షకీబల్ హసన్ ఇచ్చిన క్యాచును కేఎల్ రాహుల్ పట్టేయాల్సింది. అదే జరిగి ఉంటే తిలక్ కనీసం 8-9 ఓవర్లు వేసేవాడు. బంగ్లా కూడా అంత స్కోరు చేసేది కాదు. మహా అయితే 200 చేసేది. అప్పుడు మనం ఈజీగా గెలిచేవాళ్లం' అని చోప్రా స్పష్టం చేశాడు.