ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది.
ఆరంభంలో టపటపా వికెట్లు పడటంతో ఆత్మరక్షణలో పడిన బంగ్లాదేశ్ను కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 80), తౌహీద్ హృదోయ్ (81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. చివర్లో నాసుమ్ అహ్మద్ (44), మెహదీ హసన్ (29 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.5 ఓవర్లలో 249 పరుగులకు కుప్పకూలింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 121) సెంచరీతో పోరాడినా ఫలితం దక్కలేదు. గిల్ మినహా మిగతా బ్యాటర్లలో అక్షర్ పటేల్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42) ఒక్కడే రాణించాడు.
ఈ మ్యాచులో బంగ్లా విజయంలో కెప్టెన్ షకీబల్ హసన్ కీలకపాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటుతో రాణించిన అతను.. బంతితోనూ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తమ టీం విజయంపై సంతోషం వ్యక్తం చేసిన షకీబల్ హసన్.. 'ఇప్పటి వరకు ఆడని ప్లేయర్లకు అవకాశం ఇచ్చాం. లాస్ట్ మ్యాచులు చూసిన తర్వాత ఇక్కడ స్పిన్నర్లు రాణిస్తారని డిసైడ్ అయ్యాం' అని చెప్పాడు.
'నేను ఈ మ్యాచులో క్రీజులోకి త్వరగా వెళ్లా.. దీంతో ఎక్కువ టైం దొరికింది. ఈ వికెట్ చాలా ఛాలెంజింగ్గా ఉంది. పిచ్లో కొంత సీమ్ ఉంది. అయితే బంతి మెత్తబడిన తర్వాత ఆడటం సులభంగా మారింది. మా టీంలో మెహదీ హసన్ అద్భుతంగా ఆడాడు. కీలకమైన సమయంలో జట్టుకు బ్రేక్త్రూ అందించాడు. తంజీమ్ కూడా రాణించాడు. మాది మంచి టీం. చాలామంది గాయాలపాలవడం వల్ల నష్టం జరుగుతోంది. వరల్డ్ కప్లో మేం చాలా ప్రమాదకరమైన జట్టు అని అనుకుంటున్నా' అని షకీబల్ హసన్ ధీమా వ్యక్తం చేశాడు.