నాగ్ పూర్: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు ఇక రెండో వన్డే కోసం సన్నద్ధమౌతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చేరుకున్నాయి. ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం మధ్యాహ్నం ఆరంభం కానుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఘన విజయం సాధించిన ఊపును రెండో వన్డేలోనూ కొనసాగించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయిదు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
నాగ్ పూర్ లో అడుగు పెట్టిన రెండు జట్లు
కేప్టెన్ విరాట్ కోహ్లీ సహా దాదాపు భారత జట్టు ఆటగాళ్లందరూ ఆదివారం మధ్యాహ్నం నాగ్ పూర్ కు చేరుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన జట్టు మధ్యాహ్నానికి నాగ్ పూర్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు మరో విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి నాగ్ పూర్ కు చేరుకుంది. రెండు జట్ల ఆటగాళ్లకు విదర్భ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు నాగ్ పూర్ విమానాశ్రయంలో సాదరంగా ఆహ్వానించారు. రెండో వన్డే ఆడబోయే రెండు జట్లలో ఎలాంటి మార్పులూ దాదాపు ఉండకపోవచ్చు.
నాగ్ పూర్ లో తిరుగులేని ట్రాక్ రికార్డ్
నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ కు తిరుగులేని రికార్డు ఉంది. 2009 నుంచి 2017 వరకు జరిగిన మ్యాచుల్లో భారత జట్టు విజయాలు సాధించింది. ఈ మూడేళ్ల మధ్యకాలంలో భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఈ మూడింటిలోనూ భారత జట్టు విజయాన్ని ముద్దాడింది. 2017 లో ఇదే స్టేడియంలో తన చివరి మ్యాచ్ ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఈ సారి కూడా అతను అదే ఫామ్ ను కొనసాగించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
విదర్భ స్టేడియంలో ఆస్ట్రేలియా కూడా గెలుపు రుచిని చూసింది గానీ.. భారత్ మీద కాదు.. న్యూజీలాండ్ మీద. 2011 ప్రపంచకప్ లో నాగ్ పూర్ లో కివీస్ తో తలపడిన ఆసీస్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆ జట్టుకు అదే చివరి విజయం. నాగ్ పూర్ వన్డేలో భారత్ విజయం సాధిస్తే.. దాదాపు ఈ సిరీస్ మన చేతిలోకి వచ్చేసినట్టే. ఆస్ట్రేలియాతో రెండు ట్వీ20ల్లోనూ ఓడిపోయిన అనంతరం హైదరాబాద్ వన్డేలో భారత్ అద్భుతంగా పుంజుకొంది. ఆసీస్ జట్టును 236 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి అలవోకగా విజయాన్ని అందుకుంది.