
ఆ పర్యటనలో తొలి టెస్టు డ్రాగా ముగియగా
ఆ పర్యటనలో తొలి టెస్టు డ్రాగా ముగియగా రెండో టెస్టులో భారత్ 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లోనూ ఇంగ్లాండ్ పేసర్ల ధాటికి వరుసగా ధోని నాయకత్వంలోని టీమిండియా వరుస ఓటములను ఎదుర్కొంది. దీంతో గత పదేళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న టెస్ట్ సిరీస్ విజయాన్ని ఈసారి ఎలాగైనా ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో కోహ్లీసేన కనిపిస్తోంది. తాజా పర్యటనలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తుందని మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఛటేశ్వర్ పుజారా ధీమా వ్యక్తం చేశాడు.
భారత్ వెలుపల టీమిండియా చాలా టెస్టులు ఆడింది
ఈ నేపథ్యంలో మంగళవారం పుజారా మాట్లాడుతూ "2014లో ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత.. భారత్ వెలుపల టీమిండియా చాలా టెస్టులు ఆడింది. దీనికి తోడు.. దేశవాళీ మ్యాచ్లు ఆడటం కూడా ఇక్కడ ఆటగాళ్లకి కలిసిరానుంది. పేస్కి అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్లపై టెస్టు మ్యాచ్లు ఆడటం కష్టమే" అని అన్నాడు.

గతంలో టెస్టులు ఆడిన అనుభవం భారత్కు ఉంది
"కానీ.. ఇక్కడి వాతావరణానికి చాలా మంది ఆటగాళ్లు ఇప్పటికే అలవాటు పడ్డారు. గతంలోనూ ఇక్కడ టెస్టులు ఆడిన అనుభవం భారత్కు ఇప్పుడు కలిసి రానుంది. కచ్చితంగా ఈసారి ఇంగ్లాండ్కి గట్టి పోటీనిస్తాం" అని పుజారా ధీమా వ్యక్తం చేశాడు. ఈ టెస్టు సిరిస్కు ముందు పుజారా ఇంగ్లీషు కౌంటీల్లో యార్క్షైర్ జట్టుకు ఆడాడు. "ఇక్కడి పరిస్థితులు అర్ధం చేసుకునేందుకు కౌంటీ క్రికెట్ ఎంతగానో ఉపయోగపడింది. బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లాండ్ కఠినమైన ప్లేస్. ఎందుకంటే ఇక్కడి వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి పిచ్లు సీమర్లకు అనుకూలిస్తాయి" అని పుజారా పేర్కొన్నాడు.
40 నుంచి 50 ఓవర్ల పాటు బంతి స్వింగ్
"టెక్నిక్పై పెద్దగా కామెంట్ చేయదలచుకోలేదు. అయితే, ఇక్కడ గత అనుభవం ఎంతగానో ఉపయోగపడనుంది. 40 నుంచి 50 ఓవర్ల పాటు బంతి స్వింగ్ అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఫోకస్ పెట్టాలనేది మనం ఆలోచించాలి" అని పుజారా తెలిపాడు. టెస్టుల్లో భారత్ తరుపున అత్యుత్తమ ప్రదర్శన చేసే బ్యాట్స్మెన్లలో పుజారా ఒకడు. భారత్ తరుపున 31 టెస్టు మ్యాచ్లాడిన పుజారా 63.22 యావరేజితో 2845 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా టెస్టుల్లో పుజారాకు మంచి రికార్డు ఉంది.


Click it and Unblock the Notifications
