
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు గాను సెలక్టర్లు భారత జట్టుని శనివారం రాత్రి ప్రకటించారు. శ్రీలంకతో టీ20 సిరీస్ ముగియగానే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలక్టర్లు 17 మంది జట్టు సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించారు.
దక్షిణఫ్రికా పర్యటనలో భాగంగా జనవరి 5 నుంచి మూడు టెస్టుల సిరీస్ను టీమిండియా ఆడనుంది. టెస్టు సిరిస్ అనంతరం ఫిబ్రవరి 1 నుంచి ఆరు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే టెస్టుల్లో పోటీపడే జట్టుని ప్రకటించిన టీమిండియా సెలక్టర్లు తాజాగా వన్డే సిరీస్ కోసం జట్టుని శనివారం ప్రకటించారు.
తొడకండరాల గాయం కారణంగా శ్రీలంకతో వన్డే సిరీస్కి దూరమైన కేదార్ జాదవ్ మళ్లీ జట్టులో చోటు సంపాదించగా.. ముంబై పేసర్ శార్ధూల్ ఠాకూర్ వన్డే సిరిస్లో చోటు దక్కించుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్, సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్పై వేటు పడింది. కాగా, యో-యో టెస్టులో పాసైన సురేశ్ రైనా, యువీలకు మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపారు.
ఆరు వన్డేల సిరిస్లో భాగంగా దక్షిణాఫ్రికాలో తొలి వన్డే డర్బన్, రెండోది సెంచూరియన్, మూడోది కేప్టౌన్, నాలుగోది జొహన్నెస్ బర్గ్, ఐదోది పోర్ట్ ఎలిజబెత్, ఆరోది సెంచూరియన్లో జరుగుతుంది. స్థానిక కాలమానం ప్రకారం రెండోది మినహా అన్నీ డే/నైట్ మ్యాచ్లే.
మరోవైపు దక్షిణాఫ్రికాలో టీమిండియాకు మంచి రికార్డు కూడా లేదు. దక్షిణాఫ్రికాలో 28 వన్డేల్లో తలపడగా భారత్ కేవలం 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 21 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. రెండు మ్యాచ్ల ఫలితాలు ఫలితం తేలలేదు.
వన్డే జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్ధూల్ ఠాకూర్