
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మేము చేసిన పరుగులు అంత స్పల్పమేమీ కాదు. మ్యాచ్ను కాపాడుకునే టార్గెట్నే బంగ్లా ముందు ఉంచాం. ఫీల్డింగ్లో వైఫల్యాలు మా ఓటమికి ప్రధాన కారణం. ముష్పికర్ రహీమ్ను ఔట్ చేసే అవకాశాలు రెండుసార్లు వచ్చినా.. ఉపయోగించులేకపోయాం. బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడింది. ఈ క్రెడిట్ అంత వారిదే. మ్యాచ్ ఆరంభంలోనే మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ప్రస్తుత జట్టులో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నారు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. ఈ ఓటమి వారికి ఓ పాఠం' అని రోహిత్ అన్నాడు.
'టీ20 ఫార్మాట్లో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ మాకు ఎప్పుడూ కీలక బౌలరే. ప్రత్యేకంగా మిడిల్ ఓవర్లలో అతని బౌలింగ్తో ముఖ్య పాత్ర పోషిస్తాడు. బ్యాట్స్మెన్ క్రీజ్లో కుదురుకున్న సమయంలో చహల్ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేస్తాడు. పరుగులు కూడా నియంత్రిస్తాడు. ఈ మ్యాచులో కూడా అదే చేసాడు' అని రోహిత్ ప్రశంసించాడు. ఆగస్టు నుండి చాహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే.
'రివ్యూలు తీసుకోవడంలో కొన్ని తప్పులు జరిగాయి. ముష్ఫికర్ రహీమ్కు అవకాశం ఇచ్చాం. ఇది మా తప్పే. అతని కదలికలను సరిగా అంచనా వేయలేకపోయాం. అయితే దాని గురించి ఇప్పుడు మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే.. మ్యాచ్ అన్నాక తప్పులు జరుగుతాయి. అయితే త్వరగా తప్పుల నుండి నేర్చుకోవాలి' అని రోహిత్ చెప్పుకొచ్చాడు. రోహిత్ తొలి టీ20లో 9 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ నవంబర్ 7న రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.