2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ రిటైర్ కాబోతున్నాడా? అంటే అవుననే ఊహాగానాలు వస్తున్నాయి. సోమవారం యువరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడబోతున్నాడు. ముంబైలోని ఓ హోటల్లో అతడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించేందుకే యువరాజ్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం తెలుస్తోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
యువరాజ్ తన రిటైర్మెంట్పై కొంత కాలంగా వస్తున్న ఊహాగానాలకు ఈ రోజు జరిగే మీడియా సమావేశంతో అసలు విషయం తేల్చనున్నాడు. యువీ రిటైరయ్యాక.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్, ఐర్లండ్లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడట. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే యువీ రిటైర్మెంట్ ప్రకటించినా.. ఎవరూ ఆశ్చర్యపడరు. ఎందుకంటే యువీ గతకొంత కాలంగా జట్టులోకి ఎంపిక కాని విషయం తెలిసిందే.
2011 ప్రపంచకప్లో యువీ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో కప్ కొట్టడంలో కీలక పాత్ర పోచించాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్ విజయంలోనూ యువరాజ్ తనదైన మార్క్ చూపించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టింది కూడా అప్పుడే. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన యువీ.. 2017లో చివరి వన్డే, టీ20 ఆడాడు. ఇక ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. లీగ్ ఆరంభంలో జట్టులో చోటు సంపాదించిన యువీ.. పేలవ ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు.