హైదరాబాద్: బెంగళూరు వేదికగా టీమిండియాతో జరిగిన చారిత్రాత్మక టెస్టులో ఓటమి కన్నా తమ ఆటగాళ్ల ఆట తీరు తనను ఎంతో నిరాశకు గురి చేసిందని ఆప్ఘనిస్థాన్ ప్రధాన కోచ్ ఫిల్ సిమన్స్ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో ఏమాత్రం అనుభవంలేని అఫ్ఘనిస్థాన్ బ్యాట్స్మన్ భారత బౌలర్ల దెబ్బకు ఒకరి తరవాత మరొకరు పెవిలియన్కు క్యూ కట్టడంతో ఐదు రోజుల మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.
అరంగేట్ర టెస్టు తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే ఆలౌటైన ఆ జట్టు, ఫాలోఆన్లోనూ 38.4ఓవర్లలో 103పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ 262 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సిమన్స్ మాట్లాడుతూ "ఓడినందుకు బాధపడటం లేదు. కానీ, శుక్రవారం మేం ఆడిన విధానం తీవ్ర నిరాశకు గురిచేసింది. తొలి రోజు ఓ రెండు గంటలు మా ఆటతీరు బాగుంది" అని అన్నాడు.
"కానీ ఈ రోజు, మా ప్రదర్శపట్ల ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావడం లేదు. ఓ 30 శాతం ఈ సందర్భాన్ని నిందించవచ్చు.. మిగతాది టెస్టు క్రికెట్ గురించి తమ ఆటగాళ్లకు అంతగా తెలియకపోవడం అని చెప్పొచ్చు. తాము టెస్టు క్రికెట్లో రాణించాలంటే ఎంత మెరుగవ్వాలో ఈ మ్యాచ్ ద్వారా అర్ధమైంది. తమ జట్టు చాలా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది" అని సిమన్స్ పేర్కొన్నాడు.
"పెద్ద జట్లైనా భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వంటి ఏ జట్లతో చాలా మ్యాచ్లు ఆడాలి. అప్పుడే మేం టెస్టు మ్యాచ్ల్లో రాణించగలుగుతాం" అని సిమన్స్ చెప్పుకొచ్చాడు. కాగా, టెస్టు మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్లను ఏర్పాటు చేయాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని కూడా సిమన్స్ స్వాగతించాడు.
అయితే, తమ జట్టు తక్కువ టెస్టు ర్యాంకుల గల జింబాంబ్వే, బంగ్లాదేశ్, వెస్టిండీస్లతో ఆడాలని అప్పుడే ఆ జట్టకు గట్టిపోటీనివ్వగలుగుతుందని సిమన్స్ అభిప్రాయపడ్డాడు. రాబోయే రోజుల్లో ఆప్ఘనిస్థాన్ జట్టు టెస్టుల్లో కూడా మంచి ఫలితాలు రాబడుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.