మైసూర్: దక్షిణాఫ్రికా-ఎతో అనధికారిక రెండో టెస్టులో ఆతిథ్య భారత్-ఎ పట్టు బిగించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి భారత్ ఏ భారీ ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ పీటర్ మలన్ (6)ను ఔట్ చేసి ఆదిలోనే హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. దక్షిణాఫ్రికాను దెబ్బకొట్టాడు. అనంతరం జొండో (5), క్లాసెన్ (2) కూడా విఫలమవడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది.
'యాషెస్ టెస్ట్ ముగింపులో బొటనవేలు విరిగింది.. అయినా అలానే ఆడా'
ఈ దశలో డీబ్రూయిన్ (41)తో కలిసి కెప్టెన్ మక్క్రామ్ (83 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. అయితే డీబ్రూయిన్ పెవిలియన్ చేరినా.. మక్క్రామ్ మాత్రం మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఆట చివరకు మక్క్రామ్కు తోడు ముల్దర్ (9) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లు షాబాజ్ నదీమ్ (2/41), చైనామన్ కుల్దీప్ యాదవ్ (2/51) రెండేసి వికెట్లతో రాణించారు.దక్షిణాఫ్రికా ఇంకా 258 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 233/3తో రెండో రోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్-ఎ 417 వద్ద ఆలౌటైంది. శివం దూబే (68), కెప్టెన్ వృద్ధిమాన్ సాహా (60) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. జలజ్ సక్సేనా (48 నాటౌట్) అజేయంగా నిలిచాడు. వియాన్ ముల్దర్, డానె పిడెట్ మూడేసి వికెట్లు తీశారు. తొలిరోజు శుభ్మన్ గిల్(137 బంతుల్లో 92; 12 ఫోర్లు, సిక్స్), కరుణ్ నాయర్ (78 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధ శతకాలు చేసిన విషయం తెలిసిందే. అభిమన్యు ఈశ్వరన్ (5), ప్రియాంక్ పాంచల్ (6) త్వరగానే పెవిలియన్ చేరారు.