ఏసీసీ ఎమర్జింగ్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టును టీమిండియా చిత్తుగా ఓడించింది. గ్రూప్-బిలో భాగంగా ఇండియా-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా రాజ్వర్ధన్ హంగ్రేకర్ తన సూపర్ బౌలింగ్తో ఆ టీంను ముప్పుతిప్పలు పెట్టాడు. అతను ఈ మ్యాచ్లో ఐదు వికెట్లతో రాణించాడు.
హంగ్రేకర్తోపాటు మానవ్ సుతర్ కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇలా వీళ్లిద్దరూ రాణించడంతో పాకిస్తాన్ జట్టు తడబడింది. ఒక్కరు కూడా నిలకడగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఖాసిం అక్రమ్ (48) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో షాహిబ్జాదా ఫర్హాన్ (35) మినహా ఎవరూ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో పాకిస్తాన్ కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇక లక్ష్య ఛేదనలో భారత్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి నికిన్ జోస్ (53) చక్కని సహకారం అందించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (20) తక్కువ స్కోరుకే అవుటైనా సాయి సుదర్శన్, నికిన్ ఇద్దరూ రెండో వికెట్కు కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక చివర్లో కెప్టెన్ యష్ ధుల్ (21 నాటౌట్)తో కలిసి సాయి సుదర్శన్ లాంఛనం పూర్తి చేశాడు.
వీళ్లు చక్కగా రాణించడంతో భారత జట్టు 36.4 ఓవర్లలోనే 210 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న సాయి సుదర్శన్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇది ఈ టోర్నీలో భారత్కు వరుసగా మూడో విజయం. ఈ విజయంతో గ్రూప్-బి టాపర్గా భారత్ నిలిచింది. ఈ గ్రూప్ నుంచి భారత్, పాకిస్తాన్ రెండు జట్లు ఇప్పటికే సూపర్ ఫోర్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.