ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్.. లంకను చిత్తు చేసిన తిలక్ సేన!
IND vs SL: దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. పరుగుల వరద పారించిన ఈ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టును 66 పరుగుల తేడాతో ఓడించి భారత్ ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో లంక 6 పాయింట్లతో టేబుల్ టాపర్గా.. భారత్ 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరగా.. ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు 2 పాయింట్లతో టోర్నీ నుంచి ముందే నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇరు జట్లు తలపడటం ఇది మూడోసారి కాగా.. ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో టైటిల్ను సొంతం చేసుకుంది.
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చాడు. లంక బౌలర్ మహ్మద్ షిరాజ్ వేసిన 3వ ఓవర్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 26 పరుగులు రాబట్టిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్ హిస్టరీలోనే వరల్డ్ రికార్డు సృష్టించాడు. 29 బంతుల్లో 94 పరుగులు చేసి లంక కెప్టెన్ సహన్ అరాచిగే బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(39) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
ఓపెనర్లు ఇచ్చిన భారీ పునాదితో కెప్టెన్ తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ కలిసి మూడో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రుతురాజ్ గైక్వాడ్ 40 పరుగుల వద్ద ఔట్ కాగా.. తిలక్ వర్మ బాధ్యతాయుతంగా ఆడుతూ 90 బంతుల్లో 67 పరుగులు(4 ఫోర్లు, ఒక సిక్స్) చేశాడు. అనంతరం కుమార్ కుశాగ్ర 36 పరుగులు, విప్రజ్ నిగమ్ 27 పరుగులు చేయగా.. చివర్లో అనుకుల్ రాయ్ కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బౌలర్లలో మథులన్, వన్యుజ సహన్, రవిందు ఫెర్నాండో రెండేసి వికెట్లు పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో యశ్ ఠాకూర్ దెబ్బ
378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ జట్టుకు ప్రారంభంలోనే గట్టి షాకులు తగిలాయి. భారత పేసర్ యశ్ ఠాకూర్ పవర్ప్లేలోనే నిరోషన్ డిక్వెల్లా(25), అవిష్క ఫెర్నాండో(3), నువానిందు ఫెర్నాండో(21) వికెట్లను పడొగట్టి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు ఆ తర్వాత సదీర సమరవిక్రమ (52), కెప్టెన్ సహన్ అరాచిగే (38) నాలుగో వికెట్కు 53 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. సహన్ అవుటయ్యే సమయానికి లంక 177 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
పోరాడి ఓడిన లంక
ఆ దశలో వన్యుజ సహన్ (62), విజయకాంత్ వ్యాసకాంత్ (39) ఏడో వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యంతో భారత బౌలర్లను కాసేపు ప్రతిఘటించారు. అయితే వన్యుజ సహన్ ఔట్ కావడంతో లంక ఆశలు అడుగంటాయి. ఆఖర్లో దులాజ్ సముదిత (15), మహ్మద్ షిరాజ్ (21) ఔట్ కావడంతో శ్రీలంక 311 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్ చెరో 3 వికెట్లతో అదరగొట్టగా.. అనుకుల్ రాయ్ 2 వికెట్లు, తిలక్ వర్మ, అశోక్ శర్మ చెరో వికెట్ సాధించి భారత్కు 66 పరుగుల ఘన విజయాన్ని అందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications