హైదరాబాద్: ఆస్ట్రేలియా-ఎతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార తొలి టెస్టులో భారత్-ఎ జట్టు గెలుపు దిశగా సాగుతున్నది. ఆస్ట్రేలియా-ఎ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఎ మూడోరోజైన మంగళవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 2 వికెట్లకు 63 పరుగులు చేసింది.
మయాంక్ అగర్వాల్ (25)తో పాటు అంకిత్ బావ్నె (6) పరుగులతో క్రీజులో ఉన్నాడు. వీళ్లిద్దరు రెండో వికెట్కు 30 పరుగులు జోడించారు. అంతకముందు ఈశ్వరన్ (0), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (28) పెవిలియన్కు చేరారు. ఒక రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో భారత్ గెలువాలంటే ఇంకా 199 పరుగులు చేయాల్సి ఉండగా, 8 వికెట్లు చేతిలో ఉన్నాయి.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 42/1తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ 83.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (87) కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్ల దాటికి ఓ దశలో కంగారూలు 184 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు. కానీ లోయర్ ఆర్డర్లో నీసెర్ (25), ట్రెమెన్ (25), డొగెట్ (25) ఆకట్టుకున్నారు.
భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గౌతమ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లో కలిపి సిరాజ్ మొత్తం 11 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 243 పరుగులు చేయగా.. భారత్ 274 పరుగులు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా-ఎ తొలి ఇన్నింగ్స్: 243;
భారత్-ఎ తొలి ఇన్నింగ్స్: 274;
ఆస్ట్రేలియా-ఎ రెండో ఇన్నింగ్స్: 292 (హెడ్ 87, ఉస్మాన్ ఖాజా 40; మొహమ్మద్ సిరాజ్ 3/77);
భారత్-ఎ రెండో ఇన్నింగ్స్: 63/2 (20 ఓవర్లలో).