IND vs ENG: ఈ వయసులోనూ తగ్గట్లేదుగా.. 31వసారి ఐదు వికెట్లు తీసిన అండర్సన్! భారత్ 364 ఆలౌట్!!

లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ పేసర్ మార్క్ వుడ్ వేసిన 126.1 ఓవర్కు రవీంద్ర జడేజా (40) ఔటయ్యాడు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. మొహ్మద్ సిరాజ్ (0) నాటౌట్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లలో స్వింగ్ కింగ్, సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో జిమ్మీ ఐదు వికెట్లు తీయడం ఇది 31వసారి కావడం విశేషం. ఓలి రాబిన్సన్, మార్క్ వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మోయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది.

వెంటవెంటనే రెండు వికెట్లు:
276/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజైన శుక్రవారం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆటను కొనసాగించింది. సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (129; 250 బంతుల్లో 12x4, 1x6) ఆదిలోనే రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మరుసటి ఓవర్లో వైస్ కెప్టెన్ అజింక్య రహానే (1) సైతం పెవిలియన్ చేరాడు. ఓలి రాబిన్సన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే రాహుల్.. సిబ్లీ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జేమ్స్ అండర్సన్ వేసిన మరుసటి ఓవర్లోనే రహానే.. జో రూట్ చేతికి చిక్కాడు. దాంతో మ్యాచ్ ప్రారంభమైన రెండు ఓవర్లకే భారత్ 282/5తో నిలిచింది. కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది.

మెరిసిన జడేజా:
అనంతరం రవీంద్ర జడేజా (40; 120 బంతుల్లో 3x4)తో జోడీ కట్టిన రిషబ్ పంత్ (37; 58 బంతుల్లో 5x4) వేగంగా పరుగులు తీశాడు. దీంతో భారత స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇద్దరూ మంచి సమన్వయంతో ఆడారు. పంత్, జడేజా ఆరో వికెట్కు కీలక 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే పంత్ కుదురుకున్నట్లే కనిపించగా అనూహ్యంగా మార్క్ వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అతడు కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ 331 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. మరుసటి ఓవర్లోనే మొహ్మద్ షమీ (0) కూడా పెవిలియన్ చేరాడు.

364 పరుగులకు ఆలౌట్:
జోడీ కట్టిన రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను పూర్తి చేశారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 116 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. ఆపై జడేజా, ఇషాంత్ కాసేపు క్రీజులో నిలిచారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్కు 26 పరుగులు జోడించారు. అయితే 362 పరుగుల వద్ద ఇషాంత్ (8) ఔటవ్వగా.. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యాడు. అనంతరం జడేజా సైతం ఎక్కువసేపు నిలవలేదు. సిరాజ్ (0) నాటౌట్గా నిలిచాడు. భారత్ 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు తీయగా.. ఓలి రాబిన్సన్, మార్క్ వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

31 సార్లు:
ఈ మ్యాచులో జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు పడగొట్టడంతో.. ఓ రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. ప్రస్తుత ఆటగాళ్లలో టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఫైవ్ వికెట్ హల్ను 31 సార్లు జిమ్మీ నమోదుచేశాడు. 39 ఏళ్ల వయసులోనూ జిమ్మీలో ఏమాత్రం పడుకుతగ్గలేదు. ఆర్ అశ్విన్ (30), స్టువర్ట్ బ్రాడ్ (18), షకిబుల్ హాసన్ (18), నాథన్ లియోన్ (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియాపై టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసింది కూడా జిమ్మీనే. అండర్సన్ టీమిండియాపై 125 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ (71), అండర్ వుడ్ (62), వీల్స్ (62), బోథమ్ (59), ట్రూమాన్ (53), అలీ (50)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications