Independence Day: భారత్కు స్వాతంత్య్రం వచ్చిన శుభదినం ఆగస్టు 15. ఈ రోజు దేశ ప్రజలందరికీ గొప్ప ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తుంది. అయితే క్రికెట్ అభిమానులకు కూడా ఈ రోజు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజున భారత క్రికెట్ జట్టు కొన్ని మర్చిపోలేని విజయాలను సాధించి మన ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇప్పటివరకు ఆగస్టు 15న టీమిండియా మొత్తం 6 మ్యాచ్లు ఆడింది. వీటిలో 2 విజయాలు, 3 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. ఈ రెండు విజయాలు కూడా ఇటీవలి కాలంలో సాధించినవే కావడం విశేషం.
లార్డ్స్లో చారిత్రక విజయం(2021)
2021 ఆగస్టు 15న లార్డ్స్లో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో ఒక దశలో భారత్ ఓటమి అంచున ఉన్నట్లు కనిపించింది. కానీ భారత ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. తొమ్మిదో వికెట్కు ఏకంగా 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ బౌలర్లను అడ్డుకున్నారు. వీరి పోరాటంతో జట్టు పుంజుకుంది. ఆ తర్వాత భారత బౌలర్లు తమ సత్తా చాటారు. చివరి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి భారత్ 151 పరుగుల భారీ తేడాతో గెలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారత్ టెస్ట్ మ్యాచ్ లో సాధించిన మొట్టమొదటి విజయం ఇదే కావడం గమనార్హం. ఇది కేవలం ఒక గెలుపు కాదు.. భారత ఆటగాళ్లు పోరాట పటిమకు, గెలుపుపై ఉన్న అంకితభావానికి నిదర్శనం.

వెస్టిండీస్పై విరాట్ కోహ్లీ పోరాటం(2019)
2019 ఆగస్టు 15న పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్ కూడా అంతే ప్రత్యేకం. వాస్తవానికి ఈ మ్యాచ్ ఆగస్టు 14న మొదలైనా, వర్షం కారణంగా ఆగస్టు 15కి వాయిదా పడింది. ఈ మ్యాచ్లో భారత్కు 256 పరుగుల లక్ష్యం లభించింది. ఈ ఛేజింగ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరిగా పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 99 బంతుల్లో 114 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో భారత్ ఈ మ్యాచ్ను గెలవడమే కాకుండా సిరీస్ను కూడా గెలుచుకుంది. ఈ విజయం స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీమిండియాకు మరో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఆగస్టు 15న తొలి మ్యాచ్(1952)
స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారత్ ఆడిన తొలి మ్యాచ్ 1952 ఆగస్టు 15న ఇంగ్లండ్ జట్టుతో జరిగింది. ఇది ఒక టెస్ట్ మ్యాచ్ దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులు చేయగా.. భారత్ కేవలం 98 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విధంగా, ఆగస్టు 15న భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన రికార్డులు మన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మరిన్ని క్రీడా ఉత్సాహాన్ని నింపాయి.