Womens World Cup 2025: మహిళల ప్రపంచ కప్ 2025లో టీమిండియా ఉత్కంఠను అధిగమించి సెమీఫైనల్కు చేరుకుంది. న్యూజిలాండ్ జట్టుపై 53 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల తర్వాత సెమీస్ చేరిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది. వరుసగా మూడు ఓటముల తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ సేన పుంజుకోవడం భారత అభిమానులకు ఊరటనిచ్చింది. అయితే కీలకమైన సెమీస్లో భారత్ ఏ బలమైన జట్టును ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పాయింట్ల పట్టిక.. భారత్ నాలుగో స్థానం ఖాయం
ప్రస్తుతం టీమిండియా పాయింట్ల పట్టికలో 6 మ్యాచ్లకు 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. టోర్నమెంట్లో తమ చివరి గ్రూప్ మ్యాచ్ను బంగ్లాదేశ్ జట్టుపై గెలిచినా కూడా భారత్ మొత్తం 8 పాయింట్లతోనే ఆగుతుంది. అలా జరిగినా టాప్-3లో ఉన్న ఆస్ట్రేలియా (11), దక్షిణాఫ్రికా (10), ఇంగ్లాండ్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆఖరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా, భారత్ నాలుగో స్థానంలోనే నిలవడం ఖాయం.

సెమీఫైనల్ సమీకరణం: భారత్ వర్సెస్ నంబర్ 1
ప్రపంచ కప్ నియమావళి ప్రకారం.. సెమీఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం (నం.1)లో నిలిచిన జట్టుతో తలపడాలి. అయితే ఈ అగ్రస్థానం ఎవరిదనే దానిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుత పరిస్థితి (ఆస్ట్రేలియా): ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 11 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. కాబట్టి నియమం ప్రకారం భారత్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలి. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా తమ చివరి గ్రూప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిస్తే, వారు 12 పాయింట్లతో అగ్రస్థానంలోకి చేరుకుంటారు. అప్పుడు భారత్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. కాబట్టి, సెమీఫైనల్లో భారత జట్టు ప్రత్యర్థి ఎవరో తెలుసుకోవాలంటే, ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే కీలక మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడక తప్పదు.
భారత్ సెమీఫైనల్ మ్యాచ్ వివరాలు:
మహిళల ప్రపంచ కప్ 2025లో జరగబోయే రెండు సెమీఫైనల్స్లో మొదటి దానిని భారత్ ఆడనుంది.అక్టోబర్ 29 (గురువారం)న గౌహతిలోని డాక్టర్ భూపేన్ హజారికా క్రికెట్ స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది.