ICC Womens World Cup 2025: మహిళా క్రికెట్ ప్రపంచంలో ఛాంపియన్ ఎవరో నేడు తేలనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025 ఫైనల్ జరనుంది. భారత మహిళా క్రికెట్ జట్టు తన మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ను గెలవడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం పిచ్ ఎలా ఉండబోతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం.
డీవై పాటిల్ స్టేడియం పిచ్ రిపోర్ట్
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం పిచ్ ఎరుపు మట్టితో తయారు చేయబడింది. ఈ రకమైన పిచ్లు సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి. ఈ పిచ్ మంచి బౌన్స్ను, వేగాన్ని అందిస్తుంది. దీని వల్ల ఫాస్ట్ బౌలర్లకు ఇన్నింగ్స్ ఆరంభంలో కొంత సహాయం లభిస్తుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ స్పిన్నర్లు తమ పాత్ర పోషించడం ప్రారంభిస్తారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కీలకం అవుతారు. ఈ టోర్నమెంట్లో భారత్ ఇక్కడ మూడు మ్యాచ్లు ఆడింది. అన్నింటిలోనూ ఆధిపత్యం చెలాయించింది. న్యూజిలాండ్పై విజయం సాధించింది. సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై రికార్డు ఛేదనతో గెలిచింది. ఫైనల్ కోసం న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఉపయోగించిన పిచ్నే వాడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే, అది భారత జట్టుకు మరింత అనుకూలంగా ఉంటుంది.

టాస్ గెలిస్తే కెప్టెన్ వ్యూహం
ఒత్తిడితో కూడిన ప్రపంచ కప్ ఫైనల్లో టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ ఎంచుకోవడానికి హర్మన్ప్రీత్ కౌర్ మొగ్గు చూపవచ్చు. సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం (339 పరుగులు) భారత బ్యాటింగ్పై ఆమెకు ఉన్న విశ్వాసాన్ని పెంచింది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదించడం వల్ల స్కోరు బోర్డు ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు.పిచ్ పరిస్థితులను అంచనా వేసి లక్ష్యాన్ని ముందుగా తెలుసుకోవడం ఛేదనకు సులభతరం చేస్తుంది.
రికార్డు ఛేదన
సెమీ-ఫైనల్లో భారత్ మహిళల వన్డే చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన ఛేదన (339 పరుగులు) నమోదు చేసింది. ఈ ఊపుతోనే ఫైనల్లో బరిలోకి దిగనుంది. భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకోవడం ఇది మూడోసారి (గతంలో 2005, 2017). తొలి టైటిల్ గెలవడానికి సిద్ధంగా ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా సెమీ-ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది.