పాక్పై ఊచకోత.. ఒకే ఓవర్లో 4,1,4,6,4,4 (వీడియో)
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్డేడియం వేదికగా ఐసీసీస మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో భారత్ అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరుగుతున్న ఈ గ్రూప్ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అద్భుత ప్రదర్శన చేసి పాకిస్థాన్ ముందు 171 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రిచా ఘోష్ మెరుపులు మెరిపించడంతో భారత్ ఈ మైలురాయిని అందుకుంది.
పవర్ప్లేలో షాక్.. ఆదుకున్న స్మృతి మంధాన, హర్మన్ప్రీత్
భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభం అంత ఆశాజనకంగా సాగలేదు. పవర్ప్లేలోనే భారత్ ఇద్దరు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మను మ్యాచ్ మొదటి ఓవర్లోనే పాక్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ కూడా ఎంతో సేపు నిలబడలేక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ తస్మియా రుబాబ్ బౌలింగ్లో ఔట్ అయింది. ఈ దశలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్కు ఏకంగా 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు.

స్మృతి మంధాన క్లాస్ ఇన్నింగ్స్.. రిచా ఘోష్ మాస్ ఫినిషింగ్
ధాటిగా ఆడిన ఓపెనర్ స్మృతి మంధాన 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి రమీన్ షమీమ్ బౌలింగ్లో ఔటయ్యింది. మరోవైపు నిలకడగా ఆడిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు వికెట్ సమర్పించుకుంది. జట్టులోకి కొత్తగా వచ్చిన భారతి ఫుల్మాలి (1) తీవ్రంగా నిరాశపరిచింది. అయితే చివరి ఓవర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 17 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్సర్తో 34 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఫాతిమా సనా బౌలింగ్లో ఔట్ అయింది. రిచా మెరుపుల వల్ల భారత్ స్కోరు 170 మార్కును దాటింది.
19వ ఓవర్లో రిచా ఘోష్ ఊచకోత.. ఒకే ఓవర్లో 23 పరుగులు!
భారత ఇన్నింగ్స్ ముగిసే సమయానికి స్కోరు 150 దాటుతుందా లేదా అనుకుంటున్న తరుణంలో రిచా ఘోష్ పాక్ బౌలింగ్ను ఊచకోత కోసింది. ముఖ్యంగా మ్యాచ్ 19వ ఓవర్లో రిచా ఘోష్ సాగించిన విధ్వంసం స్టేడియంలోని అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఆ ఓవర్లో బంతిని మైదానం నలుమూలలకూ బాదేస్తూ 4, 1, 4, 6, 4, 4 రూపంలో ఏకంగా 23 పరుగులు పిండుకుంది. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రిచా.. 5 ఫోర్లు, ఒక సూపర్ సిక్సర్తో 200 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్లో ఔట్ అయింది.
ఇప్పటివరకు ఒక్కసారి కూడా మహిళల టీ20 ప్రపంచకప్ను గెలవని టీమిండియా.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. 2020 ప్రపంచకప్లో ఫైనల్ చేరి ఆస్ట్రేలియా చేతిలో రన్నరప్గా నిలవడమే ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన. ఈ మ్యాచ్లో 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న పాకిస్థాన్ను భారత్ తన ముగ్గురు స్పిన్నర్లతో ఎలా కట్టడి చేస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications