IND W vs PAK W: మహిళల ప్రపంచ కప్ 2025లో తమ రెండో మ్యాచ్ టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై దూకుడుగా ఆట మొదలుపెట్టింది. శ్రీలంకలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో భారత ఓపెనర్ ప్రతీకా రావల్ పాక్ బౌలింగ్పై దాడి చేసింది. పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత బ్యాటర్లు మొదటి నుంచి విరుచుకుపడ్డారు.
ప్రతీకా రావల్ విధ్వంసం
ఓపెనింగ్ జోడీగా వచ్చిన స్మృతి మంధాన, ప్రతీకా రావల్ తొలి ఓవర్ నుంచే పాక్పై ఒత్తిడి పెంచారు. సాధియా ఇక్బాల్ వేసిన మొదటి ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రెండో ఓవర్ వేయడానికి డయానా బైగ్ బౌలింగ్ కు వచ్చింది. ఈ ఓవర్లో ప్రతీకా రావల్ విరుచుకుపడింది. మొదటి మూడు బంతులను ఎదుర్కొన్న ప్రతీకా రావల్ ఎటువంటి పరుగు చేయలేదు. కానీ తర్వాతి మూడు బంతుల్లో ఆమె వరుసగా మూడు బౌండరీలు(4,4,4) కొట్టి హ్యాట్రిక్ ఫోర్లు నమోదు చేసింది.

ప్రతీకా రావల్ మొదటి ఫోర్ను ఆఫ్ స్టంప్ కు ఆవలగా వచ్చిన బంతిని కవర్స్ వైపు పంచ్ చేసి కొట్టింది. రెండో బంతి కూడా ఆఫ్-స్టంప్ కు దూరంగా ఉండటంతో ఆమె మరోసారి కవర్స్ వైపు బౌండరీ కొట్టింది. డయానా బైగ్ వేసిన ఓవర్ చివరి బంతిని ప్రతీకా ముందుకు వచ్చి ఆడి.. ఆఫ్ సైడ్ లో మళ్లీ ఫోర్ బాదింది. ఈ దూకుడు చూస్తుంటే.. భారత పురుషుల జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో పాకిస్తాన్ పై ఇలాంటి హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన తీరును అభిమానులకు గుర్తు చేసింది.
అజేయ రికార్డుపై భారత్ దృష్టి
మహిళల వన్డే క్రికెట్లో భారత జట్టుకు పాకిస్తాన్ పై అజేయ రికార్డు ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 11 వన్డే మ్యాచ్లలో టీమిండియానే గెలుపొందింది. చివరిసారిగా 2022 మహిళల ప్రపంచ కప్లో జరిగిన మ్యాచ్ లో భారత్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రతీకా రావల్ దూకుడుతో భారత్ ఇన్నింగ్స్ను శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో భారత జట్టు తమ అజేయ రికార్డును కొనసాగించడమే కాకుండా, పాక్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని చూస్తోంది.