Womens World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న కీలక మ్యాచ్కు అనూహ్యంగా అంతరాయం కలిగింది. కీటకాలు అధికంగా ఉండటం వల్ల భారత ఇన్నింగ్స్ మధ్యలో మ్యాచ్ ను నిలిపివేయాల్సి వచ్చింది.
కీటకాల కారణంగా ఆట నిలిపివేత
కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్లోని 28వ ఓవర్ సమయంలో అంపైర్లు ఆటను ఆపేశారు. అప్పటికి జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్ క్రీజులో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న రెండు వైపులా మైదానంపై పెద్ద సంఖ్యలో కీటకాలు ఎగురుతూ కనిపించాయి. ఈ కీటకాల వల్ల ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పాకిస్తాన్ బౌలర్ నశ్రా సంధు తన టవల్తో కీటకాలను పదేపదే తొలగించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేసి, కీటకాలను తొలగించడానికి చర్యలు తీసుకున్నారు.

పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్ప్రే
కీటకాల సమస్యను తగ్గించడానికి పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా స్వయంగా రంగంలోకి దిగింది. ఆమె స్ప్రే బాటిల్ తీసుకుని, గాలిలో కీటకాలపై స్ప్రే చేయడం ప్రారంభించింది. ఈ సమయంలో అంపైర్లు డ్రింక్స్ విరామం ప్రకటించడంతో ఆట నిలిచిపోయినా సమయం వృథా కాలేదు. మొదట స్ప్రే చేసినప్పటికీ కీటకాల బెడద తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను సుమారు 15 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆటగాళ్లు, అంపైర్లు మైదానం నుంచి బయటకు వెళ్లారు. స్టేడియం సిబ్బంది పెద్ద ఎత్తున కీటక సంహారక మందులను చల్లారు.
34 ఓవర్లు పూర్తయిన తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైనప్పటికీ.. కీటకాల సమస్య పూర్తిగా తగ్గలేదని తెలిసింది. కాగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. గత శనివారం కూడా ఇదే కారణంతో ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ రద్దయింది.