భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది. ఐర్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో ఈ ఘనత సాధించింది.
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో నేడు (జనవరి 12) రెండో వన్డేలో తలపడ్డారు భారత అమ్మాయిలు. ఈ మ్యాచ్ లోనే అత్యంత భారీ స్కోర్ చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 370 పరుగులు చేశారు.
వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. గతంలో మన అమ్మాయిల అత్యధిక స్కోర్ 358/2గా ఉంది. 2017లో ఇదే ఐర్లాండ్ జట్టుపై భారత్ 2 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్లోనూ టీమిండియా, విండీస్పై కూడా ఇదే స్కోర్ (358/5) నమోదు చేయడం విశేషం.

టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్
(91 బంతుల్లో 102; 12 ఫోర్లు) అద్భుత సెంచరీతో మెరిసింది. టాప్ ఆర్డర్ లో భారత బ్యాటర్లు స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతిక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, సిక్సర్), హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు) సూపర్ ఫాస్ట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్గాస్ట్, అర్లీన్ కెల్లీ తలో రెండు వికెట్లు తీశారు. జార్జీనా డెంప్సే ఓ వికెట్ సొంతం చేసుకుంది.
వన్డేల్లో టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్లు
370/5 ఐర్లాండ్పై (2025)
358/2 ఐర్లాండ్పై (2017)
358/5 వెస్టిండీస్పై (2024)
333/5 ఇంగ్లాండ్ పై (2022)
325/3 దక్షిణాఫ్రికాపై (2024)
317/8 వెస్టిండీస్పై (2022)
314/9 వెస్టిండీస్పై (2024)
302/3 సౌతాఫ్రికాపై (2018)
కాగా, ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లెవిన్ (92) అత్యధిక స్కోరర్ గా నిలిచింది. లియా పాల్ (59) హాఫ్ సెంచరీతో మెరిసింది.
భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సాధు, సయాలీ సత్గరే, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. ఛేదనలో భారత్ 34.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ప్రతిక రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) అర్ధ శతకాలు చేశారు. స్మృతి మంధాన (41) పర్వాలేదనిపించింది. ఐర్లాండ్ బౌలర్ అమీ మగ్నూర్ 3 వికెట్లు దక్కించుకుంది.