
లండన్: లార్డ్స్ స్టేడియం వేదికగా శనివారం ఇంగ్లాండ్ మహిళ జట్టుపై జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో ఓడించింది. చివరి వన్డే ఆడిన స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికింది. ఇది ఆమె చివరి వన్డే. మూడు వన్డేల ఈ సిరీస్ను భారత మహిళ జట్టు క్వీన్ స్వీప్ చేసింది. ఇంగ్లాండ్లో ఆ దేశ జట్టును 3-0 తేడాతో మట్టి కరిపించింది.
చివరి ఆరు ఓవర్లల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో ఛార్లీ డీన్ అనూహ్యంగా అవుట్ అయింది. 44 ఓవర్లో మన్కడింగ్ ద్వారా అవుట్ అయిందామె. ఆ ఓవర్ను దీప్తి శర్మ సంధించింది. ఆ ఓవర్ మూడో బంతిని వేయడానికి దీప్తి శర్మ సిద్ధమైన తరుణంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న ఛార్లీ డీన్ క్రీజ్ను దాటి బయటికి వచ్చింది. దీనితో ఆ బంతిని సంధించకుండానే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న వికెట్ల బెయిల్స్ను గిరాటేసింది దీప్తి శర్మ. అంపైర్ దీన్ని రనౌట్గా పరిగణించాడు.

చివరి ఆరు ఓవర్లల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో చివరి వికెట్గా ఛార్లీ డీన్.. మన్కడింగ్ ద్వారా అవుట్ కావడం ఇంగ్లాండ్ జట్టును దిగ్భ్రాంతికి గురి చేసింది. డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లు షాక్కు గురయ్యారు. అప్పటికే ఆమె 80 బంతుల్లో అయిదు ఫోర్లతో 47 పరుగులు చేసింది. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనతో ఛార్లీ కన్నీటి పర్యంతం అయింది. పిచ్ మీద ఏడ్చేసింది. స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న ఫ్రేయా డేవిస్ ఆమెను ఓదార్చడం కనిపించింది.

ఈ రనౌట్పై ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. ఛార్లీ డీన్ రనౌట్పై ఐసీసీ పోస్ట్ చేసిన ట్వీట్కు రిప్లై ఇచ్చాడు. ఇది రనౌట్ అంటే నమ్మశక్యంగా లేదని కామెంట్స్ చేశాడు. మ్యాచ్ను ముగించడానికి ఎంచుకున్న ఓ భయానక మార్గంగా అభివర్ణించాడు. మరో ట్వీట్లో ఛార్లీ డీన్ కన్నీటిపర్యంతమౌతోన్న వీడియో క్లిప్ను పోస్ట్ చేశాడు. తాను మన్కడ్పై డిబేట్ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మన్కడ్ ద్వారా మ్యాచ్లను గెలవడం వ్యక్తిగతంగా ఇష్టం లేదని, ఇతర జట్లు తనకు భిన్నంగా భావించడం చాలా సంతోషంగా ఉందటూ సెటైర్లు వేశాడు.