హరారే వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రజా టాప్ స్కోరర్. 28 బంతుల్లో 46 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ఓపెనర్లు మరుమని (32; 31 బంతుల్లో, 3 ఫోర్లు), వెస్లీ మధెవెరె (25; 24 బంతుల్లో, 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. టీమిండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, అభిషేక్ శర్మ, శివమ్ దూబె, సుందర్, తుషార్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు మరమని, వెస్లీ మొదటి వికెట్కు 63 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వారిద్దరు నిలకడగా ఆడటంతో స్కోరుబోర్డు నెమ్మదిగా ముందుకు సాగింది. మరోవైపు భారత బౌలర్లు మరింత పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. దీంతో జింబాబ్వే 15 ఓవర్లకు 98/4 స్కోరు సాధించింది.

కానీ మరో ఎండ్లో ఉన్న సికిందర్ రజా పోరాటం కొనసాగించాడు. బౌండరీలతో హోరెతిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 16వ ఓవర్ వేసిన సుందర్ బౌలింగ్లో సిక్సర్తో 13 పరుగులు రాబట్టుకున్నాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఆ తర్వాత ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 18 పరుగులు సాధించాడు. అయితే ఈ క్రమంలో సికిందర్ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో 2000+ పరుగులతో పాటు 50+ వికెట్లు సాధించిన అయిదో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ స్టార్ ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఉన్నాడు. షకిబ్ 2551 పరుగులు, 149 వికెట్లు సాధించాడు. తర్వాతి స్థానాలో మహ్మద్ నబీ (అఫ్గానిస్థాన్; 2165 పరుగులు, 96 వికెట్లు), విరాందీప్ సింగ్ (మలేషియా; 2320 పరుగులు, 66 వికెట్లు), మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్; 2514 పరుగులు, 61 వికెట్లు), సికిందర్ రజా (జింబాబ్వే, 2029 పరుగులు, 65 వికెట్లు) ఉన్నారు.