T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా సూపర్-8 పోరు క్లైమాక్స్కు చేరుతోంది. గురువారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఇప్పుడు ఇరు జట్లకు చావోరేవోగా మారింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే ప్రధాన కోచ్ జస్టిన్ సామన్ టీమిండియాను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. భారత్ తమపై ఎంత దూకుడుగా ఆడుతుందో తమకు తెలుసని.. అయితే తాము కూడా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నామని ఆయన హెచ్చరించారు.
వెస్టిండీస్ చేతిలో దెబ్బ.. భారత్పై కసి
సోమవారం రాత్రి వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 107 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు భారత్ కూడా తన మొదటి సూపర్-8 మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు జట్లు ఇప్పుడు గెలుపు కోసం ఆకలితో ఉన్నాయి. "వెస్టిండీస్ పాటించిన దూకుడు వ్యూహాన్నే భారత్ కూడా అనుసరిస్తుందని మాకు తెలుసు. టీమిండియా మాపై ఆధిపత్యం చలాయించడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలదు" అని జింబాబ్వే కోచ్ జస్టిన్ సామన్ పేర్కొన్నారు.

చెన్నై పిచ్పై జింబాబ్వే ఆశలు
వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో చేసిన తప్పుల నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని సామన్ తెలిపారు. "ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మైదానంలో ప్రశాంతంగా ఉంటూ తక్షణ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనే విషయాలపై మేము దృష్టి సారించాం. భారత బ్యాటర్ల ఫామ్ను దెబ్బతీయడమే మా లక్ష్యం. ముంబైతో పోలిస్తే చెన్నై (చెపాక్) గ్రౌండ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, ఇది మా బౌలర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది" అని ఆయన విశ్లేషించారు.
జింబాబ్వే టీ20ల్లో గతంలోనూ పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన చరిత్ర ఉంది. మరి చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో సూర్య సేనను జింబాబ్వే అడ్డుకుంటుందా లేదా భారత్ తన ప్రతాపాన్ని చూపుతుందా అనేది వేచి చూడాలి.