హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియా తర్వాత హ్యాట్రిక్ విజయాలతో హోరెత్తిస్తోంది. యశస్వీ జైస్వాల్ (93 నాటౌట్; 53 బంతుల్లో, 12 ఫోర్లు, 1 సిక్సర్), శుభ్మన్ గిల్ (58 నాటౌట్; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో విధ్వంసం సృష్టించారు.
ఛేదనను భారత్ దూకుడుగా ఆరంభించింది. జైస్వాల్ ఆది నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రిచర్డ్ వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. ఆ తర్వాత అదే జోరు కొనసాగించాడు. ఛటారా వేసిన మూడో ఓవర్లో ఏకంగా నాలుగు బౌండరీలు బాదాడు. శుభ్మన్ గిల్ కూడా జైస్వాల్కు సహకరించడంతో 3.5 ఓవర్లలోనే భారత్ 50 పరుగుల మార్క్ను అందుకుంది. ఆ తర్వాత రెండు ఓవర్లు కాస్త జాగ్రత్తగా ఆడటంతో టీమిండియా పవర్ప్లేను 61/0తో ముగించింది.

అనంతరం జైస్వాల్ మరోసారి బ్యాటు ఝుళిపించాడు. బౌండరీల మోత తిరిగి మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అనంతరం బాదే బాధ్యతలను గిల్ అందుకున్నాడు. జైస్వాల్తో పోటాపోటీగా గిల్ కూడా ఫోర్లు, సిక్సర్లు సాధించడంతో భారత్ 10 ఓవర్లకు 106/0 స్కోరు సాధించింది. ఆ తర్వాత గిల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆఖర్లో గిల్ ఎక్కువగా స్ట్రైకింగ్లో ఉండటంతో జైస్వాల్ సెంచరీ చేయలేకపోయాడు.
రాణించిన సికిందర్ రజా
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రజా (46; 28 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్లు మరుమని (32; 31 బంతుల్లో, 3 ఫోర్లు), వెస్లీ మధెవెరె (25; 24 బంతుల్లో, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, అభిషేక్ శర్మ, శివమ్ దూబె, సుందర్, తుషార్ తలో వికెట్ తీశారు.
ఓపెనర్లు మరమని, వెస్లీ మొదటి వికెట్కు 63 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వారిద్దరు నిలకడగా ఆడటంతో స్కోరుబోర్డు నెమ్మదిగా ముందుకు సాగింది. మరోవైపు భారత బౌలర్లు మరింత పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. దీంతో జింబాబ్వే 15 ఓవర్లకు 98/4 స్కోరు సాధించింది. కానీ మరో ఎండ్లో ఉన్న సికిందర్ రజా పోరాటం కొనసాగించడంతో భారత్కు జింబాబ్వే పోరాడే లక్ష్యాన్ని ఇచ్చింది.