IND vs WI: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో జరగనున్న డూ ఆర్ డై పోరుకు టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్ జట్టులో ఉన్న భయంకరమైన పవర్హిట్టర్లు, వారి బ్యాటింగ్ లోతును దృష్టిలో ఉంచుకుని టీమిండియా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోష్చేట్ విలేకరుల సమావేశంలో జట్టు ప్రణాళికలను వెల్లడించారు.
వికెట్లు తీయడమే ఏకైక మార్గం
వెస్టిండీస్ బ్యాటింగ్ శైలిపై స్పందిస్తూ భారత అసిస్టెంట్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ప్రస్తుత టీ20 క్రికెట్లో 20 ఓవర్ల పాటు కేవలం పరుగులను నియంత్రించాలనే పాత వ్యూహం ఇక పని చేయదు. షాయ్ హోప్, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పుడు పరుగులను ఆపడం కంటే వికెట్లు తీయడంపైనే దృష్టి పెట్టాలి. వికెట్లు పడగొడితేనే వారిపై ఒత్తిడి పెరుగుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

బ్యాటింగ్ లోతుపై ప్రశంసలు
వెస్టిండీస్ జట్టులో 9వ నంబర్ వరకు నాణ్యమైన బ్యాటర్లు ఉండటం ఆ జట్టుకు పెద్ద బలమని ర్యాన్ టెన్ డోష్చేట్ అంగీకరించారు. "రొమారియో షెపర్డ్ వంటి ఆటగాడు 9వ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ బాదడం సామాన్యం కాదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా విండీస్ 170కి పైగా పరుగులు చేసిందంటే వారి బ్యాటింగ్ లోతు అర్థం చేసుకోవచ్చు. అయితే మా జట్టులో కూడా అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు 8వ స్థానంలో రావడం మాకు కలిసొచ్చే అంశం" అని చెప్పారు.
దక్షిణాఫ్రికా వ్యూహమే మాకు స్ఫూర్తి
దక్షిణాఫ్రికా బౌలర్లు వెస్టిండీస్ బ్యాటర్లను ఎలాగైతే ఇబ్బంది పెట్టారో.. తాము కూడా అదే తరహాలో అటాకింగ్ బౌలింగ్ చేస్తామని ఆయన వెల్లడించారు. "దక్షిణాఫ్రికా బౌలర్లు వేసిన స్లో బంతులు విండీస్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టాయి. మా బౌలర్లు కూడా ఆ సవాలుకు సిద్ధంగా ఉన్నారు. 20 ఓవర్ల పాటు దూకుడుగా బౌలింగ్ చేస్తూ వారిపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడమే మా ప్లాన్" అని వివరించారు. ముఖ్యంగా భారత బ్యాటర్లు కూడా ప్రాక్టీస్ సెషన్లో స్లో బాల్స్ను ఎదుర్కోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు.