
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండిస్ కెప్టెన్
తిరువనంతపురం వేదికగా గురువారం జరిగిన ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. భారత బౌలర్లు రాణించడంతో పర్యాటక వెస్టిండిస్ జట్టు 31.5 ఓవర్లకే కుప్పకూలింది. వెస్టిండిస్ జట్టులో కేవలం ముగ్గురు బ్యాట్స్మన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... కెప్టెన్ జాసన్ హోల్డర్ 25 పరుగులతో టాస్ స్కోరర్గా నిలిచాడు.

టాస్ స్కోరర్గా జాసన్ హోల్డర్
ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శామ్యూల్స్(24) నిలిచాడు. విండిస్ జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్స్కే పరిమితమైపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అహ్మద్కు రెండు, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.

104 పరుగులకే ఆలౌటైన వెస్టిండిస్
వెస్టిండిస్ జట్టు ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఓపెనర్ పావెల్ డకౌట్గా వెనుదిరగగా.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సిరీస్లో అద్భుతంగా రాణించిన ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్మన్ హోప్ (0), హెట్మయర్ (9) ఆఖరి వన్డేలో దారుణంగా విఫలమవడంతో మిగతా బ్యాట్స్మెన్ కూడా పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 104 పరుగులకే ఆలౌటైంది.

ఆఖరి వన్డేలో విండిస్ గెలిచి ఉంటే 2-2తో సిరిస్ సమం అయ్యేది
అనంతరం వెస్టిండిస్ నిర్దేశించిన 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించడంతో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకోగా.. వైజాగ్ వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. ఆఖరి వన్డేలో పర్యాటక వెస్టిండిస్ జట్టు గెలిచింటే సిరీస్ 2-2తో సమమయ్యేది. ఇదిలా ఉంటే భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.


Click it and Unblock the Notifications












