
చెన్నై: భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వల్లే కేరీర్లో అత్యున్నత శిఖరాలను అందుకున్నానని ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ అన్నాడు. ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్న ప్రతీసారీ- కేరీర్లో నిలకడగా రాణించడానికి అవసరమైన విలువైర సలహాలు, సూచనలు ఇచ్చేవాడని చెప్పాడు. వాటి ఆధారంగా తాను కేరీర్ను తీర్చిదిద్దుకున్నానని వ్యాఖ్యానించాడు. ఆ క్రెడిట్ మొత్తం ధోనీకే దక్కుతుందని పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్తో కలిసి ఆడుతున్నప్పుడు ధోనీ వంటి గ్రేటెస్ట్ ప్లేయర్తో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవడాన్ని అదృష్టంగా అభివర్ణించాడు. ధోనీని ఎప్పుడు కలిసినా ఆ క్షణాలు స్ఫూర్తినింపేలా ఉంటాయని పేర్కొన్నాడు. హ్యామ్స్ట్రింగ్ గాయం వల్ల 2022 సీజన్ మొత్తానికీ దీపక్ చాహర్ దూరం అయ్యాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియా కప్ 2022 టోర్నమెంట్ ఆడబోయే టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
సాధారణంగా ఏ ప్లేయర్ కేరీర్ గ్రాఫ్లోనైనా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తుంటాయని, తన విషయంలో దీనికి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయని దీపక్ చాహర్ వ్యాఖ్యానించాడు. చాలాకాలం పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఆ సమయంలో ధోనీ ఇచ్చిన స్ఫూర్తి తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని వివరించాడు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి అడ్డదారులేవీ లేవని, కష్టపడటం ఒక్కటే మార్గమని అన్నాడు.
2021లో శ్రీలంకపై జరిగిన వన్డే ఇంటర్నేషనల్లో 69 పరుగులు చేయడం వెనుక కూడా ధోనీ ఇచ్చిన చిట్కాలే పని చేశాయని దీపక్ చాహర్ చెప్పాడు. ఆ మ్యాచ్ తనకు ఆల్రౌండర్ అనే గుర్తింపు ఇచ్చిందని, దాన్ని నిలబెట్టుకోవడం కష్టమనీ చెప్పాడు. బౌలింగ్ కంటే బ్యాటింగ్కే తాను ప్రాధాన్యత ఇస్తానని, శ్రీలంకతో జరిగిన మ్యాచ్తో ఆ కరవు తీరిందని పేర్కొన్నాడు. ధోనీ కేప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్లో ఆడిన తొలి మ్యాచ్ను ఎప్పటికీ మరచిపోలేనని, తొలి ఓవర్ వేసిన తరువాత ఆయన ప్రశంసించాడనీ చెప్పాడు.