
ఫ్లోరిడా మ్యాచ్లో..
వెస్టిండీస్తో ప్రస్తుతం జరుగుతోన్న టీ20 సిరీస్ను అమెరికాకు షిఫ్ట్ అయినప్పటికీ.. గెలుపు మాత్రం భారత్దే. ఫ్లోరిడాలోని లాడర్హిల్లో గల సెంట్రల్ బ్రొవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం జరిగిన మ్యాచ్లో కరేబియన్ వీరులపై జైత్రయాత్ర చేసింది. నికొలస్ పూరన్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టును ఓడించింది. 3-1 తేడాతో సిరీస్ను చేజిక్కించుకుంది. దీనితో- ఓటమి అనేదే తెలియకుండా వరుసగా ఎనిమిది సిరీస్లను భారత్ తన ఖాతాలో వేసుకున్నట్టయింది.

పడుతూ.. లేస్తూ..
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ టాప్ స్కోరర్. 31 బంతుల్లో ఆరు ఫోర్లతో 44 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్.. ఆరంభం నుంచే తడబడింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. టీమిండియా బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. బ్యాటర్లెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. క్రీజ్లో కుదురుగా నిలవలేకపోయారు.

బౌలర్ల పరాక్రమం..
టీమిండియా బౌలర్లు సమష్టిగా సత్తా చాటారు. భువనేశ్వర్ కుమార్, అతని కోటాలో మిగిలిన ఒక్క ఓవర్ సంధించిన దీపక్ హుడా మినహా.. మిగిలిన బౌలర్లందరూ వికెట్లు పడగొట్టారు. అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో మెరిశాడు. అవేష్ ఖాన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు చొప్పున తీసుకున్నారు. కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో వెస్టిండీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లను ఆడలేకపోయారు. భారీ షాట్ ఆడినప్పుడల్లా వికెట్ పడుతూ వచ్చింది.

పంత్ పంతం..
రిషభ్ పంత్.. టీ20 ఫార్మట్లో విలువైన ఆటగాడని మరోసారి నిరూపించుకున్నాడు. తనదైన శైలిలో ఆడాడు. ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు గానీ బంతులను బుల్లెట్లల్లా బౌండరీకి తరలించగలిగాడు. 31 బంతుల్లో ఆరు ఫోర్లతో 44 పరుగులు చేశాడు. షాట్ సెలెక్షన్లో పొరపాటు చేసి, అవుట్ అయ్యాడు. మిడిల్ స్టంప్పైకి మెక్ కే సంధించిన ఫుల్లర్ లెంగ్త్ బంతిని లాంగ్ ఆన్ వైపు స్లాగ్ షాట్ కొట్టాడు గానీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. గాల్లోకి ఎగిరిన ఆ బంతిని డ్రేక్స్ అందుకున్నాడు.

10కి పైగా రన్రేట్..
కేప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్.. ఇలా క్రీజ్లోకి వచ్చిన బ్యాటర్లందరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. వికెట్-వికెట్కు మధ్య భారీ భాగస్వామ్యం ఏర్పడింది. రన్ రేట్ ఓవర్కు 10కి పైగా పరుగులతో పోటెత్తింది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫుల్ ఫామ్లో ఉన్నట్టే. ఆసియా కప్, ఆ తరువాత టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముందు బ్యాటింగ్-బౌలింగ్లో టీమిండియా నిలకడగా రాణిస్తోండటం శుభసూచకమే.

మలుపు తిప్పిన రనౌట్..
అయిదో ఓవర్లో కేప్టెన్ నికొలస్ పూరన్ రనౌట్ కావడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఈ ఓవర్లో 4,6,0,6,6 పరుగులు చేసిన పూరన్.. చివరి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన బంతిని కవర్స్ వైపు ఆడిన పూరన్.. రన్ తీయడానికి ప్రయత్నించాడు గానీ అది సక్సెస్ కాలేదు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న మేయర్స్ ఓ మూడడుగులు ముందుకొచ్చి మళ్లీ వెనక్కి మళ్లాడు. పూరన్ క్రీజ్లోకి చేరుకునే లోపే.. సంజు శాంసన్ బంతిని వికెట్ కీపర్కు అందించడం అతను బెయిల్స్ను గిరాటేయడం చకచకా జరిగాయి.


Click it and Unblock the Notifications













