IND vs USA T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అమెరికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించిన అతిపెద్ద టర్నింగ్ పాయింట్ మాత్రం ఆ ఒకే ఒక్క క్యాచ్ మిస్ చేయడమే. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన సులువైన క్యాచ్ను అమెరికా ప్లేయర్ శుభమ్ రంజనే నేలపాలు చేయడం ఆ జట్టు కొంపముంచింది. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
15 పరుగుల వద్ధ లభించిన లక్కీ లైఫ్!
లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడుతున్న సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చారు. ఆయన కేవలం 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు శుభమ్ రంజనే బౌలింగ్లో ఓ స్లో డెలివరీని ఫ్లిక్ చేయబోయారు. బంతి బ్యాట్ పైభాగంలో తగిలి గాలిలోకి లేచి నేరుగా బౌలర్ వైపు వెళ్లింది. ఫాలో త్రూలో ఉన్న శుభం రంజనే ముందుకు డైవ్ చేసి బంతిని అందుకున్నప్పటికీ.. భూమికి తగిలిన తరుణంలో బంతిపై నియంత్రణ కోల్పోయారు. దీంతో సూర్యకుమార్ యాదవ్కు లక్కీగా లైఫ్ లభించింది. ముంబై క్రికెట్ సర్క్యూట్లో ఒకరికొకరు బాగా తెలిసిన వారు కావడంతో క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత వీరిద్దరి మధ్య మైదానంలో సరదా సంభాషణ కూడా జరిగింది.

విలన్గా మారిన శుభమ్ రంజనే.. హీరోగా మారిన సూర్య
ఆ ఒక్క తప్పు అమెరికా కొంపముంచింది. జీవనదానం పొందిన తర్వాత మిస్టర్ 360 తన విశ్వరూపాన్ని చూపించారు. అమెరికా బౌలర్లను నాలుగు వైపులా ఉతికేస్తూ కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, ఒక సిక్సర్తో అజేయంగా 84 పరుగులు రాబట్టారు. ఒక దశలో 130 పరుగులు కూడా దాటడం కష్టమనుకున్న టీమిండియా స్కోరును సూర్యకుమార్ యాదవ్ తన ఒంటరి పోరాటంతో 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారు. ఆ తర్వాత 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా.. భారత బౌలర్ల ధాటికి 132 పరుగులకే పరిమితమై 29 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరికి ఆ ఒక్క క్యాచ్ అమెరికాను చారిత్రాత్మక విజయం నుండి దూరం చేయడమే కాకుండా శుభం రంజనేను ఆ జట్టు పాలిట విలన్గా మార్చింది.