పల్లెకెలె వేదికగా మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 137 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
ఇక సూపర్ ఓవర్లో బంతిని అందుకున్న సుందర్ మూడు బంతుల్లోనే లంక కథ ముగించాడు. రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఛేదనలో సూర్య మొదటి బంతికే బౌండరీ బాది భారత్కు 'సూపర్' గెలుపు అందించాడు. అయితే ఈ ఆఖరి టీ20 సూపర్ ఓవర్కు దారి తీస్తుందని, టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరంటే అతియోశక్తి కాదు. ఎందుకంటే లంక విజయానికి ఆఖరి 12 బంతుల్లో 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.

అయితే స్పెషలిస్టు బౌలర్లు సిరాజ్, ఖలీల్ అహ్మద్కు ఓవర్లు మిగిలి ఉన్నప్పటికీ రింకూ-సూర్య బౌలింగ్ చేశారు. అప్పటివరకు టీ20 ఫార్మాట్లో బౌలింగే చేయని వారిద్దరు మ్యాచ్ను మలుపుతిప్పడం గమనార్హం. కాగా, మూడు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి మంచి లయలో ఉన్న సిరాజ్ను కాదని రింకూతో 19వ ఓవర్ వేయించడానికి గల కారణాలను కెప్టెన్ సూర్యకుమార్ వివరించాడు.
''ఆఖరి ఓవర్లో ఎవరు బౌలింగ్ చేయాలనే నిర్ణయం సులువైనది. కానీ 19వ ఓవర్ గురించి ఆలోచించడం కష్టమైనది. సిరాజ్తో పాటు మరికొందరికి ఓవర్లు మిగిలున్నాయి. అయితే ఈ పిచ్పై రింకూ సింగ్ బౌలింగ్ చేయడమే సరైనదిగా భావించా. ఎందుకంటే రింకూ బౌలింగ్ నేను చూశాను, అతనితో నెట్స్లో ప్రాక్టీస్ చేయించాను. దీంతో రింకూతో బౌలింగ్ చేయించడమే కరెక్ట్గా భావించి నిర్ణయం తీసుకున్నా''
''భారత్ తరఫున 19వ ఓవర్ బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదని తెలుసు (నవ్వుతూ). అందుకే రింకూకు ఆ బాధ్యతలు అందించా. అంతేగాక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కు రైట్ హ్యాండర్ బౌలర్ బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. అతను తన నైపుణ్యాన్ని గొప్పగా ప్రదర్శించాడు. నా పనిని సులభతం చేశాడు. ఇకపై నాకు మరో బౌలింగ్ ఆప్షన్ లభించింది'' అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.