శ్రీలంక పర్యటనలో మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. పల్లెకెలె వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆల్రౌండ్ షోతో సత్తాచాటింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవరల్లో తొమ్మిది వికెట్లకు 161 పరుగులు చేసింది. కుశాల్ పెరెరా (53; 34 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్.
రవి బిష్ణోయ్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ తొలి ఓవర్కు 6/0తో ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది .దీంతో లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే ఛేదించింది.

యశస్వీ జైస్వాల్ (30; 15 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సూర్యకుమార్ (26; 12 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), హార్దిక్ పాండ్య (22 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. కాగా, మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమికి గల కారణాలను చరిత అసలంక వివరించాడు. మిడిలార్డర్ పేలవమైన బ్యాటింగ్, వర్షం కారణంగా మ్యాచ్ను కోల్పోయామని పేర్కొన్నాడు.
''ఆఖరి ఓవర్లలో మేం ఆడిన బ్యాటింగ్ తీరు ఎంతో నిరాశ కలిగించింది. నాతో సహా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ పేలవమైన బ్యాటింగ్ చేసింది. మేం బ్యాటింగ్లో తప్పక మెరుగవ్వాలి. బంతి పాత అయ్యే కొద్దీ, బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంది. అయితే ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మేం సత్తాచాటాల్సింది. 15 నుంచి 18 పరుగులు తక్కువగా చేశాం. దురదృష్టవశాత్తు వాతావరణం కూడా మాకు అనుకూలించలేదు. అయితే అది మన చేతుల్లో ఉండదు. తడిగా ఉన్న మైదానంలో 8 ఓవర్లకు కుదించిన లక్ష్యాన్ని ఛేదించడం సులువైనది'' అని అసలంక అన్నాడు.
భారత్, శ్రీలంక జట్లలో కొత్త కెప్టెన్లతో పాటు కొత్త కోచ్ వచ్చిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్-గౌతమ్ గంభీర్కు, అసలంక-సనత్ జయసూర్యకు కూడా ఇదే తొలి సిరీస్. కాగా, మూడు టీ20ల సిరీస్లో భాగంగా పల్లెకెలె వేదికగా రేపు ఆఖరి మ్యాచ్ జరనుగంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.