పల్లెకెలె వేదికగా మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఆఖరి టీ20 సూపర్ ఓవర్కు దారి తీస్తుందని, టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరంటే అతియోశక్తి కాదు. ఎందుకంటే లంక విజయానికి ఆఖరి 12 బంతుల్లో 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.
అంతకుముందు 18వ ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ వైడ్లు అతిగా వేసి మొత్తంగా 12 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ స్థితిలో సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా బంతిని రింకూ సింగ్కు ఇచ్చాడు. అప్పటివరకు టీ20ల్లో రింకూ బౌలింగే చేయలేదు. మరోవైపు సిరాజ్ మూడు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి మంచి లయలో ఉన్నాడు. కానీ రింకూను కెప్టెన్ సూర్య నమ్మాడు.

కాగా, రింకూ సంచలన బౌలింగ్ చేశాడు. మూడే పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రింకూ బౌలింగ్ను చూసి కోచ్ గంభీర్ సైతం డగౌట్లో ఆశ్చర్యపోయి నవ్వుకున్నాడు. దీంతో లంక విజయ సమీకరణం ఆఖరి ఓవర్లో ఆరు పరుగులుగా మారింది. సిరాజ్ చివరి ఓవర్ వేస్తాడని భావించారంతా. మరో ట్విస్ట్.. ఈ సారి సూర్య బౌలింగ్కు సిద్ధమయ్యాడు. టీ20ల్లో అప్పటివరకు సూర్య కూడా బౌలింగ్ చేయలేదు. ఇదే తొలిసారి. కానీ మొదటి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా సూర్య రెండు వికెట్లు పడగొట్టడం గమనార్హం. అయితే చివరి మూడు బంతులకు లంక 5 పరుగులు చేసి మ్యాచ్ను టైగా ముగించింది.
సూపర్ ఓవర్లో బంతిని అందుకున్న సుందర్ మూడు బంతుల్లో లంక కథ ముగించాడు. రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఛేదనలో సూర్య మొదటి బంతికే బౌండరీ బాది భారత్కు 'సూపర్' గెలుపు అందించాడు. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 137 పరుగులు చేసింది.
శుభ్మన్ గిల్ (39; 37 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. రియాన్ పరాగ్ (26; 18 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (25; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. ఓ దశలో భారత్ స్కోరు 30/4, 48/5 మాత్రమే. ఈ స్థితిలో గిల్-పరాగ్-సుందర్ బ్యాటుతో గొప్ప పోరాటం చేశారు.ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.