టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ తొలి సిరీస్ను విజయవంతంగా ముగించాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ గెలుపులో కోచ్ గంభీర్- కెప్టెన్ సూర్య తమ మార్క్ను స్పష్టంగా చూపించారు. రియాన్ పరాగ్ను నయా ఆల్రౌండర్గా, పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ను ఈ సిరీస్తో గంభీర్ పరిచయం చేశాడు.
గతంలోనూ పరాగ్ బౌలింగ్ చేసినప్పటికీ శ్రీలంక సిరీస్లో తన కోటాను పూర్తి చేయించేలా గంభీర్ ఈ సారి చొరవ తీసుకున్నాడు.ఇక ఎవరూ ఊహించని విధంగా నెట్స్లో రింకూ, సూర్యతో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించి.. ఆఖరి టీ20లో ఫలితాన్ని రాబట్టాడు. అయితే లంక సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన కోచ్ గంభీర్ సెలబ్రేషన్స్లో ట్రోఫీని అందుకోవడానికి ఇష్టపడలేదు. రింకూ సింగ్ ఎంత బతిమిలాడినా అంగీకరించలేదు.

అసలేం జరిగిందంటే.. శ్రీలంకతో మూడో టీ20 ముగిసిన అనంతరం ట్రోఫీని సూర్యకుమార్ అందుకున్నాడు. అనంతరం జట్టు సభ్యులతో కలిసి ఛాంపియన్ వేదికపై ట్రోఫీతో ఫొటోకు ఫోజులిచ్చాడు. అయితే సపోర్ట్ స్టాఫ్ను కూడా సూర్య ఫొటోకు ఆహ్వానించాడు. గంభీర్తో సహా సహాయక సిబ్బంది అందరూ ఛాంపియన్ వేదికగా దగ్గరకు వచ్చారు. గంభీర్ చివర్లో నిలబడ్డాడు. అయితే కోచ్గా ఈ తొలి సిరీస్ విజయాన్ని ఆటగాళ్ల మధ్యలో ఉండి ఆస్వాదించాలని ట్రోఫీని అందుకోవాలని రింకూ, రియాన్ పరాగ్ రిక్వెస్ట్ చేశారు.
రింకూ గంభీర్ దగ్గరకు వెళ్లి చాలా సేపు బతిమిలాడాడు. కానీ గంభీర్ నో చెప్పాడు. గ్రూప్లో చివర్లో ఉంటూ ఫొటోకు ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. క్రెడిట్ను ఆటగాళ్లకే వదిలేయాలని గంభీర్ ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఆఖరి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 137 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించింది.