టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ మరో పర్యటనకు సిద్ధమైంది. పది రోజుల్లో శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. లంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. మెగాటోర్నీలో గెలిచిన అనంతరం భారత్కు ఇది రెండో పర్యటన అయినప్పటికీ.. సీనియర్లు బరిలోకి దిగుతున్న మొదటి సిరీస్ ఇదే. జింబాబ్వే పర్యటనకు శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే శ్రీలంక సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లక్ష్యంగా రోడ్ మ్యాప్ను లంక సిరీస్తోనే ప్రారంభించనుంది. అంతేగాక నయా కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే కోచ్ బాధ్యతలు చేపట్టనుండటం; స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టిఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. లంక పర్యటనకు భారత జట్టు ఎంపికపై అందరిలో ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి భారత జట్టు ప్రకటన గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇవాళ కచ్చితంగా బీసీసీఐ జట్టును ప్రకటిస్తుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే బుధవారం భారత జట్టును ప్రకటించట్లేదని తాజా సమాచారం. సెలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది.కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం మీటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ దాన్ని గురువారానికి వాయిదా వేశారు.
వాయిదాకు కారణమేంటి?
శ్రీలంక పర్యటనకు టీమిండియా జులై 22వ తేదీన బయలుదేరాల్సి ఉంది. దీంతో భారత జట్టును త్వరగానే ప్రకటించాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ లంక వన్డే సిరీస్కు సీనియర్లు ఉండాలని నయా కోచ్ గంభీర్ కోరడంతో ఎంపిక వాయిదా పడుతుందని తెలుస్తోంది. వన్డేలకు రోహిత్ అందుబాటులో ఉండేలా బీసీసీఐ కోరడంతో, ఈ విషయం గురించి టీమిండియా కెప్టెన్ కాస్త సమయాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో రోహిత్ నుంచి స్పష్టత వచ్చే వరకు వాయిదా వేస్తున్నారని సమాచారం. మరోవైపు కోహ్లి, బుమ్రా లంక పర్యటనకు విశ్రాంతి కోరినట్లు తెలుస్తోంది.