
కొలంబో: వర్షం కారణంగా ఆగిన భారత్-శ్రీలంక మూడో వన్డే మ్యాచ్ మొదలైంది. అంపైర్లు మ్యాచును 47 ఓవర్లకు కుదించారు. దాంతో మనీశ్ పాండే, సూర్యకుమార్ బరిలోకి దిగారు. చమీరా వేసిన 24వ ఓవర్లో సూర్య రెండు ఫోర్లు బాదాడు. దాంతో జట్టు స్కోర్ 150 దాటింది. అయితే 25వ ఓవర్లో టీమిండియాకు షాక్ తగిలింది. జయవిక్రమ వేసిన 24.5 ఓవర్కు మనీశ్ పాండే (11) ఔటయ్యాడు. వికెట్ల వెనుక కీపర్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 157 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ (31), హార్దిక్ పాండ్యా (11) ఉన్నారు. 26 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 168 రన్స్ చేసింది.
మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో ఏకంగా ఐదుగురు ప్లేయర్స్ భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేశారు. వికెట్ కీపర్ సంజు శాంసన్, బ్యాట్స్మన్ నితీశ్ రాణా, పేసర్ చేతన్ సకారియా, ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్, స్పిన్నర్ రాహుల్ చహర్ తమ తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్నారు. దీంతో భారత్ ఓ రికార్డు నెలకొల్పింది. ఇలా ఒకే మ్యాచ్లో ఐదుగురు ప్లేయర్స్ భారత్ తరఫున అరంగేట్రం చేయడం 41 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1980-81లో ఇలా ఒకే వన్డేలో ఐదుగురు కొత్త వాళ్లకు తొలిసారి టీమిండియా అవకాశం ఇచ్చింది.
టీమిండియాకు సరైన ఆరంభం దక్కలేదు. 28 పరుగులు వద్ద కెప్టెన్ శిఖర్ ధావన్ ఔట్ అయ్యాడు. చమీర బౌలింగ్లో భనుకకు క్యాచ్ ఇచ్చి గబ్బర్ పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఆడిన ధావన్ 3 ఫోర్లతో 11 పరుగులు చేశాడు. ధావన్ పెవిలియన్ చేరినా.. యువ ఓపెనర్ పృథ్వీ షా (49, 49 బంతుల్లో 8x4) చెలరేగాడు. అతడికి సంజు శాంసన్ (46, 46 బంతుల్లో 5x4, 1x6) కూడా సహకరించాడు. ఇద్దరూ ధాటిగా ఆడడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో షా ఔట్ అయ్యాడు. ఆపై శాంసన్ కూడా ఔట్ అయ్యాడు.
సూర్యకుమార్, మనీశ్ పాండేలు లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. సూర్య-మనీశ్ 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సమయంలో మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించింది. 23 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశారు. 23 ఓవర్లలో భారత్ మూడు నష్టానికి 147 పరుగులు చేసింది. సూర్య, పాండే క్రీజులో ఉన్నారు.