
కొలంబో: మూడు వన్డేల సిరీస్లో భాగంగా కొలంబోని ప్రేమదాస మైదానంలో మరోకొద్ది సేపట్లో భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లంక తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఉరుసు ఉదానా బదులు కసున్ రజిత జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో భారత కెప్టెన్ శిఖర్ ధావన్ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గాయం నుంచి కోలుకున్న సంజు శాంసన్కు నిరాశే ఎదురైంది.
పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన యువ భారత్.. మరో విజయం సాధించాలని చూస్తోంది. రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను దక్కించుకోవాలని ధావన్ సేన పట్టుదలగా ఉంది. ఇక ఈ ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు ముందు భారత్ ఆడుతున్న చివరి పరిమిత ఓవర్ల సిరీస్ ఇదే కాగా.. మెగా టోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలని యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు రెండో వన్డేలో తప్పిదాలు దిద్దుకోవాలని ఆతిథ్య శ్రీలంక ఆశిస్తోంది. తొలి వన్డేని కేవలం 37 ఓవర్లలోనే ముగించేసిన టీమిండియాను ఓడించాలంటే శ్రీలంక ఆటతీరు మెరుగుపడాలి.
కొలంబోని ప్రేమదాస మైదానం పిచ్ స్పిన్కు సహకరించినా.. బ్యాటింగ్కూ అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. సగటు స్కోర్ 270. ఈ మ్యాచ్ కోసం వేరే పిచ్ను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఈ కాలంలో ఇక్కడ జల్లులు పడుతుంటాయి. కానీ ఈరోజటి మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్.
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్), వహిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లక్షణ్ సందకన్, కసున్ రజిత.