కొలంబో వేదికగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన భారత్- శ్రీలంక తొలి వన్డే టైగా మారింది. మందకొడి పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (58; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (33; 57 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (31; 43 బంతుల్లో, 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) చెరో మూడు, వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటారు.

ఛేదనలో భారత్కు శుభారంభం దక్కింది. పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా హిట్ మ్యాన్ చెలరేగడంతో వపర్ప్లేలో ఇండియా 71 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. అక్షర్-కేఎల్ రాహుల్ భాగస్వామ్యంతో భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. ఆఖర్లో దూబె (25; 24 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులతో విజయ సమీకరణం 15 బంతుల్లో ఒక్క పరుగుగా మారింది. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. కానీ అలసంక వరుసగా దూబె, అర్షదీప్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో టైగా మారింది.
అయితే టీమిండియాకు 230 పరుగుల లక్ష్యం సరిపోతుందని ముందే భావించానని శ్రీలంక కెప్టెన్ అసలంక మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ''230 పరుగుల లక్ష్యం కాపాడుకుంటామని భావించా. అయితే మేం టీమిండియాను 230 పరుగుల కంటే తక్కువ స్కోరుకే పరిమితం చేయాల్సింది. మధ్యాహ్నం సమయంలో బంతి ఎక్కువగా టర్న్ అయ్యింది. కానీ లైట్స్ వెలుతురులో బ్యాటింగ్కు సులువగా మారింది''
''ఎడమచేతి వాటం బ్యాటర్లు రావడం, స్పిన్కు బాగా అనుకూలించడంతో నేను బౌలింగ్ చేయాలనుకున్నా. ఫీల్డింగ్లో మా ఆటగాళ్లు ఎంతో ఎనర్జీ చూపించారు, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో. ఇది సంతోషంగా ఉంది. వెల్లలాగే, నిస్సాంక బ్యాటింగ్ బాగా చేశారు'' అని అలసంక పేర్కొన్నాడు. ఆదివారం రెండో వన్డే జరగనుంది.