
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్.. స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోహ్లీసేన సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 85 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. భారత్ రెండు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (50; 19 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), రోహిత్ శర్మ (30; 16 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడారు. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ (4 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచులో లోకేష్ రాహుల్ పలు రికార్డులు నమోదు చేశాడు.
స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. రాహుల్ 18 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. దాంతో టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. యువీ 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ 2009లో శ్రీలంకపై 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 2007లో ఆస్ట్రేలియాపై, 2009లో శ్రీలంకపై యువరాజ్ 20 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు.
ఇక టీ20 ప్రపంచకప్లలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. యువీ 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది ఈ అరుదైన ఫీట్ తన పేరుపై రాసుకున్నాడు. ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా యువీ దరిదాపుల్లోకి రాలేదు. 2014లో స్టీఫెన్ మేబెర్గ్ 17 బంతుల్లో ఫిఫ్టీ బాది ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2014లో గ్లెన్ మాక్స్వెల్, 2021లో కేఎల్ రాహుల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీలు బాది సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.