
వైజాగ్: మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాట్స్మెన్ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో అచ్చొచ్చిన వైజాగ్ పిచ్పై భారత్ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి రోజు పేసర్ మొహమ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని 3 టెస్టుల ఫ్రీడమ్ సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది.
తొలి టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఓపెనర్గా దిగి డకౌట్ అయిన రోహిత్ శర్మ అసలు సమరంలో దుమ్ములేపాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీల మోత మోగించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. ఓపెనర్గా దిగిన తొలి టెస్టులోనే వరుస రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. మరోవైపు ఒక టెస్టులో రెండు సెంచరీలు బాదిన ఆరో బ్యాట్మెన్గా కూడా నిలిచాడు. ఇంతకు ముందు విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఈ ఫీట్ను సాధించారు.
మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ 30ఓ పరుగులకు పైగా తొలి వికెట్ భాగస్వామ్యం సాధించి రికార్డు సృష్టించారు. భారత్, దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్లో అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం సాధించిన ఓపెనర్లుగా మయాంక్, రోహిత్ రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు 1996లో గ్యారీ కిరిస్టెన్, హడ్సన్ 236 పరుగుల రికార్డును భారత్ ఓపెనింగ్ జోడీ బద్దలు కొట్టింది. పరిమిత ఓవర్లలలో .ఓపెనర్గా దుమ్ములేపే రోహిత్.. టెస్ట్ ఫార్మాట్లో కూడా సత్తా చాటాడు.
ప్రస్తుతం రోహిత్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీలు అందరూ తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'రోహిత్కు అద్భుతమైన టెస్టు మ్యాచ్ ఇది. టెస్టు క్రికెట్లో ఓపెనింగ్ చేయాలన్న రోహిత్ కల నెరవేరింది. రోహిత్కు శుభాకాంక్షలు. భారత్ సాధించిన అతి గొప్ప విజయం. ఇందులో మాయంక్ అగర్వాల్, మొహమ్మద్ షమీ, ఆర్ అశ్విన్, చటేశ్వర్ పుజారాల సహకారం కూడా ఉంది' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రోహిత్ ఔట్స్టాండింగ్ అంటూ ఆకాశానికెత్తేశాడు.