IND vs SA: సచిన్ ప్రపంచ రికార్డ్పై కన్నేసిన కోహ్లీ.. మరో 133 పరుగులు చేస్తే..?


హైదరాబాద్: ఈనెల 12 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా గురవారం తొలి వన్డే జరగనుంది. వన్డేల సిరీస్ నేపథ్యంలో సఫారీలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళవారం ధర్మశాలకు ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. మరోవైపు భారత క్రికెటర్లు కూడా మంగళవారం అక్కడికి వెళతారు. అంతకుముందు బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్, వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.

మరో 133 పరుగులు చేస్తే:
వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రపంచ రికార్డ్పై కన్నేశాడు. కోహ్లీ మరో 133 పరుగులు చేస్తే.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డ్ సచిన్ పేరిట ఉంది. సచిన్ 300 ఇన్నింగ్స్ల్లో 12 వేల పరుగులు చేయగా.. కోహ్లీ కేవలం 239 ఇన్నింగ్స్ల్లోనే ఆ మార్క్కు సమీపానికి వచ్చేసాడు.

సచిన్ @ 1:
వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మార్క్ని అందుకున్న టాప్ క్రికెటర్గా ప్రస్తుతం సచిన్ కొనసాగుతున్నాడు. సచిన్ (300) తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (314), కుమార సంగక్కర (336), సనత్ జయసూర్య (379), మహేల జయవర్దనె (399)లు వరుసగా ఉన్నారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో కోహ్లీ మరో 133 పరుగులు చేస్తే.. అగ్రస్థానానికి దూసుకొస్తాడు. వన్డే కెరీర్లో సచిన్ 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ ఇప్పటికే 43 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్ పర్యటనలో విఫలం:
ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. మొత్తం 11 ఇన్నింగ్స్లలో కలిపి 218 పరుగులే చేసాడు. కోహ్లీ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపిన ఒక టూర్లో చేసిన అత్యల్ప పరుగులు ఇవే కావడం గమనార్షం. దీంతో అనేక విమర్శలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సఫారీలతో వన్డే సిరీస్లో ఫామ్ అందుకోవాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. సొంత గడ్డపై కాబట్టి కోహ్లీ గాడిలో పడే అవకాశాలే ఎక్కుబాగా ఉన్నాయి.

గంగూలీ రికార్డు బ్రేక్:
కివీస్ పర్యటనలోని తొలి వన్డేలో కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంతో.. టీమిండియా కెప్టెన్గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో స్థానానికి చేరుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసే క్రమంలో కోహ్లీ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు. కెప్టెన్గా గంగూలీ 142 ఇన్నింగ్సులలో 5,082 పరుగులు చేయగా.. కోహ్లీ 83 ఇన్నింగ్స్లలో 5,123 పరుగులు చేసాడు. మాజీ కెప్టెన్లు మహ్మద్ అజహరుద్దీన్ 5,239 (162 ఇన్నింగ్స్), ఎంఎస్ ధోనీ 6,641 (172 ఇన్నింగ్స్) కోహ్లీ కంటే ముందున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications