జొహానెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల తేడాతో నెగ్గి నాలుగు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. తిలక్ వర్మ (120 నాటౌట్; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 10 సిక్సర్లు), సంజు శాంసన్ (109 నాటౌట్; 56 బంతుల్లో, 6 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ శతకాలతో విధ్వంసం సృష్టించారు.
అభిషేక్ శర్మ (36; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. సిపామ్లా (1/58) ఒక్క వికెట్ తీశాడు. అనంతరం కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెస్ (43; 29 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (36; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3/20) మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి (2/42), అక్షర్ పటేల్ (2/6) చెరో రెండు వికెట్లు, హార్దిక్, రమన్దీప్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. అయితే వరుస సెంచరీలతో చెలరేగుతున్న తిలక్ శతక సంబరాలు భిన్నంగా ఉన్నాయి. సాధారణంగా ప్రతి ప్లేయర్ సెంచరీ తర్వాత హెల్మెట్, బ్యాటుతో అభిమానులకు అభివాదం చేస్తుంటాడు. మరికొందరు ఆటగాళ్లు ఆవేశంగా, ప్రత్యేకమైన మార్క్లతో సెలబ్రేషన్స్ చేస్తుంటారు. కానీ తిలక్ వర్మ ఆవేశంగా సంబరాల అనంతరం, ఒక చేతిని తన చెవి వద్ద, మరో చేతిని ఆకాశం వైపు చూస్తూ సెలబ్రేషన్స్ చేశాడు. అలా ఎందుకు చేశాడో మ్యాచ్ అనంతరం తిలక్ వివరించాడు.
''గతేడాది ఇదే మైదానంలో తొలి బంతికే డకౌటయ్యాను. ఇక ఈ ఇన్నింగ్స్ జట్టుకు, సిరీస్ సాధించడానికి ఎంతో కీలకంగా మారింది. గత మ్యాచ్లో తగ్గట్లుగానే నా బేసిక్స్ను కొనసాగిస్తూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. అయితే దక్షిణాఫ్రికాలోని సవాలైన పరిస్థితుల్లో వరుసగా రెండు సెంచరీలను ఊహించలేదు. ఈ ఫీలింగ్ను మాటల్లో చెప్పలేకపోతున్నాను. దేవునికి, కెప్టెన్ సూర్యకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇక సెలబ్రేషన్స్ గురించి చెప్పాలంటే.. గత కొన్ని నెలల్లో గాయానికి గురయ్యాను. కానీ దేవునిపై, నా ప్రక్రియపై విశ్వాసాన్ని ఉంచి కొనసాగించాను. అందుకే భగవంతునికి అంకితమిచ్చేలా సంబరాలు చేశాను'' అని తిలక్ వర్మ పేర్కొన్నాడు.