సెంచూరియన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో, 8 ఫోర్లు, 7 సిక్సర్ల) సెంచరీతో కదంతొక్కాడు.
అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతంతో సత్తాచాటడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహరాజ్, సిమెలన్ చెరో రెండు వికెట్లు, జేన్సన్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులకు పరిమితమైంది. జేన్సన్ (54 నాటౌట్; 17 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) పోరాడారు.

కాగా, మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. తిలక్ వర్మ చెప్పి మరీ, వీరబాదుడు బాదాడని సూర్య చెప్పాడు. రెండో టీ20 అనంతరం మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపాలని తిలక్ తనని అడిగాడని, ముందే చెప్పినట్లుగా సెంచూరియ్ మ్యాచ్లో తిలక్ సత్తాచాటాడని అన్నాడు. మూడో టీ20లో తిలక్ వర్మ మూడో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
''గెబెహ్రా రెండో టీ20 అనంతరం తిలక్ వర్మ నా రూమ్కు వచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు చేస్తానని అడిగాడు. నేను సరే అని చెప్పాను. వన్డౌన్లోనే వెళ్తు, స్వేచ్ఛగా ఆడమని సూచించాను. తిలక్ అడిగాడు, చెప్పింది చేశాడు'' అని సూర్యకుమార్ అన్నాడు. విజయం గురించి మాట్లాడుతూ.. ''చాలా సంతోసంగా ఉంది. టీమ్ మీటింగ్లో మాట్లాడుకున్నట్లుగా బ్రాండ్ క్రికెట్ను ఆడాం. గతంలో ఐపీఎల్లో ఫ్రాంచైజీలకు, నెట్స్లో ఆడినట్లుగానే సాధికారికంగా ఆడారు''
''అన్నీ సానుకూలంగా జరుగుతుండటం ఆనందంగా ఉంది. ఆవేశం, తీవ్రత అనేది మాటల్లో ఉండదు. ఇక ప్లేయర్లు వాళ్ల బ్యాటింగ్తో నా పనిని సులభతరం చేశారు. జట్టు సరైన దిశలో వెళ్తుందని భావిస్తున్నాను'' అని సూర్యకుమార్ పేర్కొన్నాడు. కాగా, తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.