జొహానెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల తేడాతో నెగ్గి నాలుగు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. తిలక్ వర్మ (120 నాటౌట్; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 10 సిక్సర్లు), సంజు శాంసన్ (109 నాటౌట్; 56 బంతుల్లో, 6 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ శతకాలతో విధ్వంసం సృష్టించారు.
అభిషేక్ శర్మ (36; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. సిపామ్లా (1/58) ఒక్క వికెట్ తీశాడు. అనంతరం కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెస్ (43; 29 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (36; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3/20) మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి (2/42), అక్షర్ పటేల్ (2/6) చెరో రెండు వికెట్లు, హార్దిక్, రమన్దీప్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

అయితే వరుస శతకాలతో చెలరేగిన తిలక్ వర్మ అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో తిలక్ నాలుగు మ్యాచ్ల్లో 140 సగటు, 198 స్ట్రైక్రేటుతో 280 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2020/21లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో కోహ్లి 231 పరుగులు చేశాడు. అయిదు మ్యాచ్ల్లో 115 సగటు, 147 స్ట్రైక్రేటుతో పరుగులు చేశాడు.
ఇక మూడో టీ20లో పాటు ఆఖరి టీ20లో సెంచరీ బాదిన తిలక్ వర్మ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అయిదో స్థానంలో నిలిచాడు. తిలక్ కంటే ముందు ఈ ఘనతను గుస్తావ్ మెకియాన్, రిలే రోసోవ్, ఫిలిప్ సాల్ట్, సంజు శాంసన్ సాధించారు. కాగా, శాంసన్తో 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేసి తిలక్ ఆల్టైమ్ రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో ఏ వికెట్కు అయినా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అలాగే సౌతాఫ్రికాపై ఏ వికెట్కు అయినా ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. అంతర్జాతీయ టీ20ల్లో రెండో వికెట్ లేదా అంతకంటే దిగువ వికెట్లకు కూడా ఇదే భారీ భాగస్వామ్యం.