T20 World Cup 2026: టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రయాణం అహ్మదాబాద్లో ఆందోళనకర మలుపు తిరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ దారుణంగా విఫలమైంది. కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు బెడిసికొట్టడంతో 188 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.
ఛేదనలో తడబడిన బ్యాటర్లు
188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ సున్నా పరుగులకే (డక్) వెనుదిరిగాడు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. భారత ఓపెనర్లు వరుసగా నాలుగు ఇన్నింగ్స్ల్లో డకౌట్ కావడం. గత మూడు మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ సున్నా చుట్టగా.. ఇప్పుడు ఇషాన్ అదే బాటలో పయనించాడు. దీంతో టాపార్డర్ వైఫల్యం జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది.

గంభీర్ వ్యూహాలపై విమర్శలు
ఈ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. రింకూ సింగ్, శివమ్ దూబే వంటి వంటి స్పెషలిస్ట్ హిట్టర్లు ఉండగా.. వాషింగ్టన్ సుందర్ను ప్రమోట్ చేయడం ఎవరికీ అర్థం కాలేదు. ఒత్తిడి సమయంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై నమ్మకం ఉంచకపోవడం విమర్శలకు దారితీసింది. అక్షర్ పటేల్ను పక్కన పెట్టి సుందర్ను తీసుకోవడం కూడా తప్పుడు నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.'ఫియర్ లెస్' క్రికెట్ ఆడాలనే ప్రయత్నంలో, వికెట్లు పడుతున్నా భారత్ ఏ దశలోనూ ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేయలేదు.
పట్టు తప్పిన భాగస్వామ్యం
చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే మధ్య సాగిన ఆరో వికెట్ భాగస్వామ్యం మ్యాచ్ను మలుపు తిప్పలేకపోయింది. చివరి 7 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సి ఉండగా.. వారి బ్యాటింగ్లో ఆశించిన వేగం కనిపించలేదు. అవసరమైన రన్ రేట్ 15 దాటిపోయినా, ఆటగాళ్లలో గెలవాలనే తపన లోపించినట్లు కనిపించింది.
భారత్ తన దూకుడు మంత్రాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యూహాల్లో స్పష్టత లేకపోతే, ఈ ప్రపంచకప్ ప్రయాణం మరింత కష్టతరం కానుంది. గౌతమ్ గంభీర్ తన శిక్షణ శైలిని, జట్టు మేనేజ్మెంట్ నైపుణ్యాలను మార్చుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.