
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లల్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను చిత్తు చేసింది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఇక తన తదుపరి మ్యాచ్ను ఆదివారం ఆడబోతోంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఈ రెండు జట్లు గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. పెర్త్ స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్ కోసం టీమ్ మొత్తం పెర్త్కు చేరుకుంది కూడా. అక్కడే నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. తొలుత పాకిస్తాన్, అనంతరం నెదర్లాండ్స్ను ఓడించిన భారత్ ఇప్పుడిక దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. టీమిండియాతో సమవుజ్జీగా ఉన్న జట్టు కావడం వల్ల ఈ మ్యాచ్లో పోరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.
ఈ పరిణామాల మధ్య దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ నోర్ట్జె కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు తమ బౌలింగ్ అటాక్ తడాఖా చూపించబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే తమది బెస్ట్ బౌలింగ్ అటాక్గా అభివర్ణించాడు. తమ బౌలింగ్లో వైరుధ్యం ఉందని, అది ఎలాంటి బ్యాటర్లనయినా ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నాడు. పెర్త్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నోర్ట్జె మాట్లాడాడు. వేగం, వైరుద్ధ్యం, లైన్ అండ్ లెంగ్త్.. ఇవన్నీ తమ బౌలింగ్లో ఉన్నాయని చెప్పాడు నోర్ట్జె.
ఇద్దరు యువ స్పిన్నర్లు తమ అమ్ములపొదిలో ఉన్నారని నోర్ట్జె గుర్తు చేశాడు. భారత్తో ఆడబోయే మ్యాచ్ తమకు అత్యంత కీలకమైనదని, ఇందులో గెలిచి తీరాల్సిన అవసరం తమకు ఉందని అన్నాడు. వర్షం వల్ల తాము ఆడిన మ్యాచ్ రద్దయిందని, ఫలితంగా పాయింట్లను షేర్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ పరిస్థితుల్లో ప్రతి పాయింట్ కూడా అవసరమేనని పేర్కొన్నాడు. ఈ టీ20 ప్రపంచకప్ను కొట్టబోతోన్నామని స్పష్టం చేశాడు.