భారత్-దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని, టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా జట్టు కూర్పు గురించి ఓ క్లారిటీ వస్తుందని భావించారంతా. కానీ వరుణుడు అభిమానులందర్ని నిరాశపరిచాడు. వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దైంది. అయితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానం మొత్తాన్ని కవర్స్ తో కప్పి ఉంచనందకు మండిపడ్డాడు.
''గ్రౌండ్ మొత్తం కవర్స్ కప్పి ఉంచకపోతే వర్షం ఆగిన తర్వాత కూడా మరో గంట పాటు ఆట కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. అంతేగాక మరోసారి అకస్మాతుగా వర్షం కురిస్తే ఆటే కొనసాగదు. అన్ని దేశాల క్రికెట్ బోర్డుల దగ్గర చాలా డబ్బు ఉంది. లేదు అని చెబితే.. వారు అబద్ధం చెబుతున్నట్లే. బీసీసీఐ వద్ద ఉన్నంత డబ్బు సౌతాఫ్రికా బోర్డు దగ్గర లేకపోవచ్చు. కానీ, మైదానం మొత్తాన్ని కప్పి ఉంచే కవర్స్ ను కొనేందుకు అయినా డబ్బు ఉంటుంది కదా?''అని గవాస్కర్ అన్నాడు.

2019 వరల్డ్ కప్ లో ఇదే కారణంగా ఎన్నో మ్యాచ్లు రద్దు అయ్యాయని గవాస్కర్ గుర్తు చేశాడు. ''గ్రౌండ్ ను సరిగా కవర్స్ తో కప్పి ఉంచలేనందుకే ప్రపంచకప్ లో ఎన్నో మ్యాచ్ లు రద్దు అయ్యాయి. వర్షం ఆగింది. కానీ అవుట్ ఫీల్డ్ తడిగా ఉంది. దాని వల్ల చాలా జట్లు పాయింట్లు కోల్పోయాయి'' అని పేర్కొన్నాడు. 2019 మెగాటోర్నీలో శ్రీలంక రెండు మ్యాచ్ ల్లో ప్రత్యర్థి జట్లతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. అలాగే సౌతాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ కూడా రద్దు అయింది.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ మొత్తాన్ని కవర్స్ తో కప్పి ఉంచుతారని, మ్యాచ్ జరిగేలా అక్కడ సిబ్బంది ఏర్పాట్లు చేస్తారని గవాస్కర్ తెలిపాడు. ఈడెన్ గార్డెన్స్ ను అలా గొప్పగా చేయడానికి సౌరవ్ గంగూలీ కారణమని అన్నాడు. కాగా, మూడు టీ20ల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో రేపు భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది.