
కటక్లో జరిగిన రెండో టీ20లో టీమిండియా విధించిన 149పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఈజీగా ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్ తన టీ20 కెరీర్లోనే అత్యధిక స్కోరు (81పరుగులు 46బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సులు) వీరవిహారం చేయడంతో దక్షిణాఫ్రికా 4వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో 10బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది. ఈ మ్యాచ్ ఓటమి అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 'మేము బ్యాటింగ్లో మరో 10, 15 పరుగులు చేయాల్సింది. మా బౌలర్లు తొలి 8ఓవర్ల వరకు రాణించారు. భువీ అద్భుతంగా రాణించగా.. సపోర్టింగ్గా మిగతా ఫాస్ట్ బౌలర్లు తోడ్పడ్డారు. కానీ ఆ తర్వాత మేం ఆ స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాం. సెకండాఫ్లో మాకు వికెట్లు దక్కాల్సింది.. కానీ దక్కలేదు. క్లాసెన్, బవుమా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది. తదుపరి గేమ్లో మేం మెరుగ్గా ఆడతామని ఆశిస్తున్నాం. మేం ఇక మిగిలిన మూడు గేమ్ల్లోనూ గెలవాలి.' అని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నా.. రిషబ్ పంత్ తన కెప్టెన్సీతో చిన్నచిన్న మిస్టేక్స్ చేసి ఓటమికి కారకమయ్యాడంటూ నెట్టింట కామెంట్లు హోరెత్తుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ ద్వారా కెప్టెన్గా పంత్ పనికొస్తాడా లేదా అనే డౌట్లు కూడా రేకెత్తుతున్నాయి.
ఒక కెప్టెన్ ఇలా బ్యాటింగ్ చేస్తాడా?
బ్యాటింగ్లో 9ఓవర్లకు టీమిండియా 2వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఇక ఈ సిచువేషన్లో పంత్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. ఈ టైంలో ఏ కెప్టెన్ అయినా క్రీజులో వీలయినంత సేపు తాను నిలబడాలని ఆలోచిస్తారు. మరో ఎండ్లో బ్యాటర్ ఉన్నప్పుడు తప్పకుండా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడతారు. కానీ రిషబ్ పంత్ మాత్రం అత్యంత దారుణంగా ఔటయ్యాడు. కేశవ్ మహరాజ్ వైడ్ వేసిన బంతిని లెఫ్ట్ వికెట్ సైడ్ స్టెప్ అవుట్ అయి మరీ హిట్ చేయాలని చూశాడు. ఆ షాట్ ఎంపిక అత్యంత పేలవం. అది గాల్లోకి లేవడంతో పంత్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 5పరుగులకే పెవిలియన్ చేరాడు. అతని షాట్ ఎంపిక బట్టే పంత్ కెప్టెన్ అయినప్పటికీ తన బాధ్యతారాహిత్యమైన షాట్లను మాత్రం వదల్లేదనే ఫీలింగ్ అభిమానుల్లో కలిగింది.
బౌలర్లను ఇలాగేనా ఉపయోగించుకోవడం
రిషబ్ కెప్టెన్సీ వైఫల్యంలో ప్రధాన కారణం.. బౌలర్లను సరిగా వినియోగించుకోలేకపోవడమే. పిచ్ స్వభావాన్ని కనిపెట్టి బౌలర్లను ఛేంజ్ చేసే కెపాసిటీ రిషబ్ పంత్కు లేనట్టు స్పష్టంగా రెండు టీ20 మ్యాచ్లలో అర్థమైపోయింది. హర్షల్ పటేల్ లాంటి బౌలర్ను పవర్ ప్లేలో పంత్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. తొలి టీ20లో పవర్ ప్లేలో హర్షల్ పటేల్కు 6వ ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు. ఆ ఓవర్లో హర్షల్ వికెట్ తీసి కేవలం ఒక్క రన్ మాత్రమే ఇచ్చాడు. రెండో మ్యాచ్లో అసలు పవర్ ప్లేలో హర్షల్కు బౌలింగే ఇవ్వలేదు. చాహల్, హర్షల్ పటేల్లను పూర్తిగా రాంగ్ టైంలో బౌలింగ్ చేయిస్తూ పంత్ మూల్యం చెల్లించుకున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రభావవంతంగా పడట్లేదని తెలిసినా పదేపదే ఇస్తూ అతనికి కాస్త అధికంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. తద్వారా బౌలింగ్ గజిబిజీ గందరగోళంగా తయారవుతుంది.
అందరూ అతనికి సజేషన్స్ ఇచ్చేవాళ్లేనా
రిషబ్ పంత్ ఫీల్డింగ్ సెట్ కూడా తన ఆలోచన మేరకు జరుగుతుందా అనేది డౌటే. ఐపీఎల్లో కెప్టెన్సీ సేవలందించిన ప్లేయర్లు తమ అనుభవాన్ని ఇండియా జట్టులో చూపించాలని బాగా తహతహలాడుతున్నట్లు కన్పిస్తుంది. ఫీల్డింగ్ సెట్ విధానంలో మిగతా వాళ్ల ప్రమేయం ఫీల్డ్లో ఎక్కువైనట్లు కన్పిస్తోంది. ఇక వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అజమాయిషీ కాస్త ఎక్కువ ఉన్నట్లు కన్పిస్తోంది. తన కంటే సీనియర్లయిన ప్లేయర్లను అదుపులో పెట్టుకోలేక రిషబ్ కాస్త తలొగ్గాల్సి వస్తున్నట్లు కొన్ని సిచువేషన్లు కన్పిస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లోనూ దినేష్ కార్తీక్ రావాల్సిన చోట అక్షర్ పటేల్ను పంపించడం చాలా విడ్డూరంగా అన్పించింది. ఇక ఏదేమైనా కాస్త అయోమయానికి, గందరగోళానికి రిషబ్ పంత్ గురువుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అతనికి ఇంకాస్త అనుభవం కావాల్సి ఉందని, లేకపోతే కొన్నాళ్లు వైస్ కెప్టెన్గా పనిచేశాకా కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాల్సిన అవసరముందని పలువురు పేర్కొంటున్నారు.