టీ20 వరల్డ్ కప్ -2024 ముగిసిన అనంతరం టీమిండియా టాప్ ఆర్డర్లో రెండు స్థానాలు ఖాళీలయ్యాయి. దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో దాదాపు దశాబ్దం తర్వాత ఓపెనర్, మూడో స్థానం ఖాళీ అయ్యాయి. అయితే రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఓపెనర్లు ఎంతో మంది వచ్చారు. హిట్ మ్యాన్ అడుగుజాడల్లోనే రికార్డుల వేట కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.
కానీ వన్డౌన్లో వచ్చే విరాట్ కోహ్లి స్థానానికి మాత్రం సరైన ప్రత్యామ్నాయ ప్లేయర్ దొరకలేదు. టీ20 వరల్డ్ కప్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో వచ్చాడు. రెండు అర్ధశతకాలు సాధించినప్పటికీ నిలకడగా పరుగులు సాధించలేకపోయాడు. వన్డౌన్లో సంజు శాంసన్ను కూడా ట్రై చేశారు. కానీ ఏది వర్కౌట్ కాలేదు.

అయితే దక్షిణాఫ్రికా పర్యటనలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మూడో స్థానంలో వచ్చి వరుసగా రెండు శతకాలతో కదంతొక్కాడు. టీ20ల్లో కోహ్లికి సరైన వారసుడు అనిపించుకున్నాడు. అంతేగాక ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా ఉన్న కోహ్లి రికార్డును తిలక్ బ్రేక్ చేశాడు. కాగా, తిలక్కు సూర్య తానంతట తానే మూడో స్థానంలో అవకాశం ఇవ్వలేదు. తిలక్ వర్మ అడగ్గా.. సూర్య అంగీకరించి మద్దతు ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని తిలక్ నిజం చేశాడు. ఈ క్రమంలో సూర్య.. కోహ్లికి వారసుడు 22 ఏళ్ల తిలక్ అని ప్రకటించాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి భారత్కు ఎన్నో అద్భుత విజయాలు విరాట్ కోహ్లి అందించాడని, అయితే ఇప్పుడు ఆ స్థానంలో ఓ యువ ప్లేయర్ రావడానికి సరైన సమయమని భావిస్తున్నాని సూర్య పేర్కొన్నాడు. ఆ స్థానానికి తిలక్ వర్మ సరైనోడు అని తెలిపాడు. ప్రస్తుతానికి మాత్రమే కాదని, భవిష్యత్లో కూడా తిలక్ ఈ బాధ్యతలను గొప్పగా నిర్వరిస్తానని భావిస్తున్నట్లు అన్నాడు. గత రెండు మ్యాచ్ల్లో తిలక్ విధ్వంసాన్ని చూశానని, అయితే అతను టీ20లకు మాత్రమే కాకుండా ఫార్మాట్లలో భారత జట్టులో ఉండాలని కోరుకుంటున్నాని సూర్య చెప్పాడు.