టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా భారత్ నిలిచింది. 13 ఏళ్ల ప్రపంచకప్ కలను రోహిత్ సేన నెరవేర్చింది. సినిమా లెవెల్లో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఆశలు లేని స్థితి నుంచి గొప్పగా పోరాడి ఫైనల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. సమష్టిగా పోరాడుతూ ఓటమిని భయపెట్టి గెలుపు తీరాలకు ఘనంగా చేరింది. బార్బడోస్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబె (27; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. కేశవ్ మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 34/3తో కష్టాల్లో పడింది. కానీ కోహ్లి-అక్షర్ జట్టును గొప్పగా ఆదుకున్నారు.

అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (39; 31 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడాడు. హార్దిక్ పాండ్య (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు. అయితే సౌతాఫ్రికా విజయానికి ఆఖరి అయిదు ఓవర్లలో 30 పరుగులే అవసరం.
సఫారీ జట్టు చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉండటం.. క్రీజులో కుదురుకున్న క్లాసెన్, ప్రమాదకర మిల్లర్ ఉండటంతో విజయంపై భారత్ ఆశలు సన్నగిల్లాయి.కానీ బుమ్రా, హార్దిక్, అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రత్యర్థిని చిత్తుచేస్తూ జగజ్జేతగా టీమిండియాను నిలిపారు. కాగా, విజయానంతరం భారత ఆటగాళ్లు ఎమోషనల్ అయ్యారు. అందరి కళ్లల్లో ఆనందభాష్ఫాలు అనిపించాయి.
అయితే వ్యాఖ్యాతలకు ఇంటర్వ్యూ ఇస్తున్న హార్దిక్ పాండ్య.. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ను, కోచింగ్ సిబ్బందిని కొనియాడాడు. వాళ్లంతా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారని అన్నాడు. కోచ్ పదవికి వీడ్కోలు పలికిన ద్రవిడ్కు ఇది ఘనమైన ఫేర్వెల్ అని తెలిపాడు. కాగా, ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ జాతీయ జెండాతో హార్దిక్ వద్దకు వచ్చాడు. భావోద్వేగంతో హార్దిక్కు రోహిత్ ముద్దుపెట్టాడు. వరల్డ్ కప్ గెలవడంలో ఆల్రౌండర్గా హార్దిక్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీలో బ్యాటుతో పాటు బంతితో సత్తాచాటాడు.